నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 5: రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడోరోజైన ఆదివారం గ్రామాలు, పట్టణాల్లో ప్రగతి పనుల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు స్వయంగా పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. మురుగు కాల్వల్లో పూడిక తీత, రోడ్డు పక్కన ముండ్ల పొదల తొలగింపు, పాడుబడిన బావులు, వినియోగంలో లేని బోర్ల పూడ్చివేత, శిథిలాలు, వ్యర్థాల తరలింపు, వేలాడుతున్న విద్యుత్తు తీగల సవరణ తదితర పనులను చేపట్టారు. పల్లెల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పల్లె, పట్టణ ప్రగతి పనులతో గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా మారుతున్నాయి.
మంత్రుల పర్యటన
ఆదివారం ఉదయం జనగామ జిల్లా పాలకుర్తి దళిత, బీసీ కాలనీల్లో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. తానే స్వయంగా డ్రైనేజీల్లో చెత్తను తొలగించారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని 3వ వార్డులో పట్టణ ప్రగతి, భూపాలపల్లి మండలంలోని కొత్తపల్లి (ఎస్ఎం), చిట్యాల మండలంలోని దూత్పల్లి, ఒడితల, గోపాలపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పట్టణ ప్రగతిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని 19, 20వ వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితారెడ్డి, కమిషనర్ గణేశ్రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి ఎంపీ పారిశుద్ధ్య పనులు చేపట్టారు. 20వ వార్డులో మురుగు కాలువలో చెత్తను స్వయంగా తొలగించారు.
సమస్యల పరిష్కారానికే పల్లెనిద్ర : నిరంజన్రెడ్డి
పల్లెల్లోని సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేసేందుకే పల్లెనిద్ర చేపడుతున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆదివారం వనపర్తి జిల్లా పెద్దగూడెం తండా పల్లెనిద్రలో మంత్రి పాల్గొన్నారు. తండావాసులతో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తండాకు చెందిన ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే తమ తండాలో సాగునీళ్లు, 24 గంటల కరెంట్ చూస్తున్నామని తెలిపింది. పెద్ద ఎత్తున ఏర్పాటుచేసిన గురుకులాలతో తమలాంటి వారి ఉన్నత విద్య కల సాకారం అవుతుందని చెప్పింది.