షాబాద్, మే 31: తెలంగాణలో పల్లెప్రగతి పనులు ఎంతో బాగున్నాయని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్కుమార్ ప్రశంసించారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్నగర్, నందిగామ మండలం చేగూరు గ్రామాలను రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్, ఎస్బీఎం డైరెక్టర్ సురేశ్బాబు, కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్తో కలిసి సందర్శించారు. అనంతరం ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, కంపోస్ట్యార్డు, హరితహారం నర్సరీలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి కొద్దిసేపు వాలీబాల్ ఆడారు.