హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్కుమార్ ప్రశంసించారు. పల్లెప్రగతిలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాల వివరాలను ఇతర రాష్ట్రాలకు అందిస్తే అక్కడ సైతం అమలు చేస్తారని చెప్పారు. కేంద్రం పంచాయతీలకు విడుదల చేసే గ్రాంట్లు విడుదలయ్యేలా చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పంచాయతీరాజ్శాఖ కార్యక్రమాల అమలు తీరుపై సోమవారం ఆయన బీఆర్కే భవన్లో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ శరత్ సమావేశంలో పాల్గొన్నారు.
సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లెప్రకృతి వనాలు, మంచినీటి సరఫరా, నర్సరీలు, వైకుంఠధామాలతో పాటు ప్రతి ఊరిలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల్లో అమలవుతున్న టీఎస్ బీ-పాస్ను గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అవార్డుల్లో మొదటి పది అవార్డులు తెలంగాణ గ్రామాలకే వచ్చాయని గుర్తుచేశారు. గ్రామాల్లోనూ ఆటో మ్యుటేషన్లను ప్రారంభించామన్నారు.అన్ని గ్రామాలను జీఎస్టీ, ఎస్జీఎస్టీ పరిధిలోకి తెచ్చామని వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యదర్శి సునీల్కుమార్ను సీఎస్ సన్మానించారు.