ఇల్లందకుంట, జూలై 17: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు ఓటమి భయం పట్టుకున్నదని అందుకే ఇంటింటికీ కుట్టుమెషిన్లు, గోడ గడియారాలు, కుక్కర్లు పంపిణీ చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బోగంపాడు, పాతర్లపల్లిలోప్రజలతో సమావేశమయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిందని, ఈటల చేసింది ఏమిలేదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లోయర్ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. నీళ్లు లేక, వర్షాలు పడక రైతులు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వాన కాలం పంటలు వేసేవారని, ఇప్పుడు సీఎం కేసీఆర్పై నమ్మకంతో రైతులు ముందస్తు నాటుకు సిద్ధమవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.