జనగామ : 45 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పని చేశారు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా పార్టీకి కట్టుబడి నిలబడ్డారు. ఐక్యంగా ఉండి జనగామలో బీఆర్ఎస్ ను గెలిపించుకోబోతున్నారని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాత్రనక, పగలక పార్టీ కోసం పని చేసిన శ్రేణులకు శిరస్సు వంచి వందనం చేస్తున్నాను. ప్రణాళికబద్ధంగా ప్రచారం జరిగింది.
131 గ్రామాలు, రెండు పట్టణాలు, 8 మండల కేంద్రాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారన్నారు. పట్టణంలో మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు అంతా నా వైపు ఏకపక్షంగా ఉన్నారని స్పష్టం చేశారు. చాలా గౌరవప్రదంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నదని, ఇందులో ఎవరికి కించిత్ అనుమానం కూడా లేదని ధీమాగా చెప్పారు. ఓటర్లను ప్రతిపక్షాలు ప్రలోభ పెట్టాలని, బెదిరించాలని చూసినా విచక్షణతో ఓటేశారు. ప్రచారంలో భాగంగా నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి మిత్రులు వచ్చి నా కోసం పని చేశారని వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ తాడు బొంగరం లేని పార్టీ.. ఎన్నికల్లో చిల్లరగా ప్రవర్తించిందన్నారు. సీపీఎం నాయకులు గూండాల్లగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యలర్తలపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాం.. చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జము, మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, రైతుబంధు సమితి అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, నిమ్మతి మహేందర్ రెడ్డి, పసుల ఏబెల్, తదితరులు పాల్గొన్నారు.