తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పాలకుర్తి నియోజకవర్గంలోని కామారెడ్డిగూడెం గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు. తమ నాయకుడు నియోజకవర్గానికి వస్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యలోనే ఆయన్ను కలుసుకుని సన్మానించారు.
శనివారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదం తెలిపే సమావేశం పూర్తి కాగానే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గానికి బయల్దేరి వెళ్లారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యేందుకు నియోజకవర్గానికి బయల్దేరారు. ఇంతలో తమ నాయకుడు గ్రామానికి వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు ఆయన్ను కలుసుకున్నారు. అక్కడే ఉన్న శ్రీకంఠమహేశ్వర స్వామి గుడికి రమ్మని గౌడ సోదరులు మంత్రిని ఆహ్వానించారు. అక్కడ మంత్రిని సత్కరించారు. ఈ క్రమంలో గంగ దేవమ్మ గుడి, పెద్దమ్మ గుడి, బీరప్ప గుడి వద్దకు వెళ్లిన మంత్రి పరిసరాలను పరిశీలించారు. గుడికి ప్రహరీ కూడా లేకపోవడంతో వెంటనే ఈ ప్రహరీ కూడా కట్టించాలని, ఇందుకు సంబంధించిన అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గుడికి ప్రహరీ గోడ కట్టించే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు.
అలాగే శ్రీ కంఠమహేశ్వర స్వామి గుడి పరిశీలించి ప్రహరీ గోడ నిర్మిస్తానని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. గౌడ కులస్తులకు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు వెంటనే అంచనాలు రూపొందించి, సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో బీరప్ప, పెద్దమ్మ, గంగ దేవమ్మ భక్తులు, కంఠమహేశ్వర స్వామి భక్తులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని కల్లు తాగాలని గీత కార్మికులు కోరారు. వాళ్ల కోరికను మన్నించి మంత్రి కల్లు తాగి వాళ్లతో ఆనందం పంచుకున్నారు.