పాలకుర్తి రూరల్, జనవరి 13: పాలకుర్తిని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పోతన విగ్రహాన్ని ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, వాల్మీకి మహామునితోపాటు మహిమాన్వితమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్.. బమ్మెరకు స్వయంగా వచ్చి జనగామ జిల్లా పర్యాటక పనులకు రూ.40 కోట్లు మంజూరు చేశారని అన్నారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి పర్యాటక పనులకు అదనంగా మరో రూ.20 కోట్లు మంజూరు చేయించినట్టు చెప్పారు. ప్రస్తుతం రూ.60 కోట్లతో పనులు జరుగుతున్నట్టు తెలిపారు. బమ్మెరలో పర్యాటక పనులు తుది దశకు చేరుకున్నాయని, పాలకుర్తిలో పాల్కురికి సోమనాథుడి కల్యాణ మండపం, సోమనాథుడి విగ్రహంతోపాటు సోమేశ్వర ఆలయంలో చేపట్టిన పనులను పూర్తి చేసి మహాశివరాత్రికి సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వల్మిడి గుట్టపైన చేపట్టిన పనులు పూర్తిచేసి శ్రీరామ నవమికి ప్రారంభించనున్నట్టు చెప్పారు. చెన్నూరులోని చాళుక్యుల కాలం నాటి త్రికూటాలయానికి రూ.కోటి మంజూరైనట్టు తెలిపారు.