జనగామ : జనగామ జిల్లా పాలకుర్తిలోని స్వయంభు శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కార్మిక మాస ఉత్సవాల సందర్భంగా ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న అఖండ దీపోత్సవానికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం హన్మకొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దీపోత్సవంలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు మంత్రిని ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం కార్తికమాసంలో జరిగే అఖండ దీపోత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుందని , ఆలయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వీరమనేని యాకంత రావు, పురోహిత జేఏసీ సంఘం అధ్యక్షుడు డీవీ ఆర్ శర్మ, ఆలయ పర్యవేక్షకులు కొత్తపెల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.