హైదరాబాద్ / హిమాయత్నగర్,మార్చి21: రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో పనిచేసే 52వేల మంది కార్మికులకు ఏడు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం హిమాయత్నగర్లోని తెలంగాణ కమిషనర్ పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కార్యాలయం ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ధర్నా అనంతరం సీఐటీయూ, యూనియన్ నేతలు డిప్యూటీ కమిషనర్ రామారావుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గ్యార పాండు, ప్రధానకార్యదర్శి చాగంటి వెంకటయ్య, నాయకులు గణపతిరెడ్డి, సుధాకర్, యాదమ్మ, వినోద్ కుమార్, మహేశ్,మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.