నిజామాబాద్ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడిన ఎమ్మెల్సీ కవిత ఉద్యమం పట్ల సర్వత్రా హర్షం వ్యక్త మవుతున్నది. ఎమ్మెల్సీ కవిత పోరాటానికి తలొగ్గిన కేంద్రం 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women’s Reservation Bill) లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో నిజామాబాద్లోని భారత్ జాగృతి అధ్వర్యంలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి విద్యార్థినులు, మహిళా నేతలు, జాగృతి నాయకులు పాలాభిషేకం చేశారు.
మొదట కేసీఆర్ కమాన్ నుంచి క్యాంపు కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి పాలభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం గళం వినిపించడంలో ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ ముందు ఉంటారని చెప్పారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా విశేషంగా కృషి చేస్తున్న కవితకు ధన్యవాదాలు తెలిపారు.
కవిత పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి బిల్లుకు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత గురించి మొదటి నుంచి పోరాడుతున్న కవితకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది యావత్ మహిళా లోకం విజయంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు అపర్ణ, సుమనా రెడ్డి, విశాలిని రెడ్డి, భారత జాగృతి జిల్లా అధ్యక్షురాలు అవంతి రావు, నరాల సుధాకర్, లక్ష్మి నారాయణ,చిన్ను గౌడ్, తదితరులు పాల్గొన్నారు.