హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగంలోని నిమ్స్లో ఇక నుంచి నవజాత శిశువులు, 2 కిలోల బరువున్న శిశువులకు సైతం గుండె శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడం సంతోషకరమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్, సువెన్ ఫార్మాసూటికల్ సహకారంతో నిమ్స్లో రూ.5 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాలజి సర్జరీ యూనిట్, 200 ఐసీయూ పడకలు, 5 ఎక్మో, 5 ఆర్సీసీటీ, 125 వెంటిలేటర్లను మంత్రి గంగుల కమలాకర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు సురేష్గుప్తా, సెక్రటరీ కళ్యాణ్, నిమ్స్ కార్డియోథొరాసిక్ హెచ్వోడీ అమ్రేశ్తో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అంతకుముందు మంత్రి అధికారులతో కలిసి దవాఖాన మొత్తం కలియతిరిగారు.
దవాఖానలో అందుతున్న వైద్యసేవల గురించి స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు దవాఖానలోని వార్డులను పరిశీలించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ రోటరీక్లబ్, సెవెన్ ఫార్మాసూటికల్ సహకారంతో పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్ను ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. జూబ్లీహిల్స్ రోటరీక్లబ్ మొదటి నుంచీ నిమ్స్కు ఎంతో సహకారాన్ని అందిస్తున్నదని, ఇప్పుడు కూడా సుమారు రూ.5 కోట్ల విలువైన పీడియాట్రిక్ కార్డియాలజీ యూనిట్ను నిమ్స్కు అందించిందని తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు సురేష్గుప్తా, సెక్రటరీ కళ్యాణ్, నిమ్స్ కార్డియోథొరాసిక్ హెచ్వోడీ అమ్రేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాలజీ యూనిట్ అనేది నవజాత శిశువుల్లో పుట్టుకతోనే గుం డెకు రంధ్రాలు ఏర్పడినప్పుడు శస్త్ర చికిత్సలు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి హరీశ్ చెప్పారు. ఇప్పటివరకు 5 కిలోల బరువున్న పిల్లలకే గుండె శస్త్రచికిత్సలు నిమ్స్లో చేసేవారని, ఇక నుంచి ఈ కొత్త యూనిట్ ద్వారా 2.5 కిలోల బరువున్న నవజాత శిశువులకు సైతం శస్త్రచికిత్స చేయవచ్చని తెలిపారు. వీరితో పాటు బ్లూ బేబీస్కు కూడా ఈ యూనిట్ ఎంతో ఉపయోగపడనున్నట్టు తెలిపారు.
నిమ్స్లో మొదటి నుంచీ కేవలం 166 ఐసీయూ బెడ్లు మాత్రమే ఉండేవని, రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అదనంగా 200 ఐసీయూ పడకలను ప్రారంభించినట్టు మంత్రి పేర్కొన్నారు. దీంతో ఐసీయూ పడకల సంఖ్య 366కు పెరిగిందని తెలిపారు. త్వరలో మరో 74 ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పనులు జరుగుతున్నాయని, ఇవి కూడా అందుబాటులోకి వస్తే నిమ్స్లో ఐసీయూ పడకల సంఖ్య 166 నుంచి 440కి పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఇక్కడ ఐసీయూ పడకల కొరత ఉండబోదని అన్నారు. వెంటిలేటర్ల కొరత కూడా ఉండేదని, గతంలో కేవలం 68 వెంటిలేటర్లు మాత్రమే ఉండేవని, ఇది గమనించిన సీఎం కేసీఆర్ అదనంగా మరో 125 వెంటిలేటర్లను మంజూరు చేసినట్టు తెలిపారు.
ఈ 125 వెంటిలేటర్లలో 25 అడ్వాన్స్డ్ లైఫ్ సేవింగ్ వెంటిలేటర్లు ఉన్నట్టు చెప్పారు. దీంతో ప్రస్తుతం 193 వెంటిలేటర్లు ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కరోనా సమయంలో వ్యాధి తీవ్రంగా మారి చివరి దశలో ఉన్న రోగులకు ఎక్మో సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, దీనిని దృష్టిలో పెట్టుకుని నిమ్స్లో 5 ఎక్మో ఎక్విప్మెంట్లను ప్రారంభించినట్టు తెలిపారు. కిడ్నీ రోగులకు బెడ్ వద్దనే డయాలసిస్ చేయడానికి 5 సీఆర్ఆర్టీ ఎక్విప్మెంట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. నిమ్స్లో రూ.50 కోట్లతో 200 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్కు త్వరంలో ఫౌండేషన్ వేస్తామన్నారు. ఇందులో హైరిస్క్ ప్రెగ్నెన్సీ మహిళలకు చికిత్స అందించనున్నట్టు వివరించారు.
నిమ్స్ను మరింత విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. ప్రస్తుతం నిమ్స్లో 1480 పడకలు ఉన్నాయని, ఇవి సరిపోనందున మరో 2000 పడకల సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ను నిమ్స్కు అనుబంధంగా తీసుకురావాలని సీఎం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ క్రమంలో పక్కనే ఎర్రమంజిల్ కాలనీలోని 32 ఎకరాల స్థలాన్ని నిమ్స్కు కేటాయించామని గుర్తు చేశారు.
ఈ స్థలంలో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 200 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ నిర్మించనున్నట్టు తెలిపారు. 2000 పడకల సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన పనులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, త్వరలోని దీనికి పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇంతకాలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్కే పరిమితమయ్యామని, కొత్తగా రానున్న 6000 సూపర్స్పెషాలిటీ పడకల ద్వారా మెరుగైన సేవలు అందనున్నట్టు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో వైద్యంతో పాటు సూపర్స్పెషాలిటీ కోర్సులను సైతం వైద్యవిద్యార్థులకు అందించనున్నట్టు వెల్లడించారు. ఈ సంవత్సరం కొత్తగా 16 పీజీ సీట్లను పెంచేందుకు ఎన్ఎంసీకి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి క్లియరెన్స్ వస్తే ప్రస్తుతం ఉన్న 167 పీజీ సీట్లతో పాటు ఈ 16 పీజీ సీట్లకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనున్నట్టు చెప్పారు.