హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్ యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. వెంటనే స్పందించిన రైల్వే శాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో కొన్ని రైళ్ల వేళలను మార్చారు.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ (12763)తో పాటు రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రీ షెడ్యూల్ చేశారు. సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ రాత్రి 7.45 గంటలకు, తిరుపతి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరాల్సిన తిరుపతి-నిజాముద్దీన్-రాయలసీమ ఎక్స్ప్రెస్ రాత్రి 8 గంటలకు బయలుదేరాయి.