Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో రెండో అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్యనాయుడు సహా ఐదుగురికి పద్మ విభూషణ్ను ప్రకటించింది. కళారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గానూ.. కొణిదెల చిరంజీవి( ఆంధ్రప్రదేశ్), వైజయంతిమాల (తమిళనాడు ), పద్మ సుబ్రహ్మణ్యం (తమిళనాడు ), ప్రజా వ్యవహారాల్లో వెంకయ్యనాయుడు (ఆంధ్రప్రదేశ్), సామాజిక సేవకుగానూ బిహార్కు చెందిన బిందేశ్వర పాఠక్ (మరణానంతరం)ను రెండో అత్యున్నత పురస్కారం వరించింది. కాగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పురస్కారాలు ప్రకటించారు. వీటిలో ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి ముగ్గురిని పద్మశ్రీ వరించింది. బుర్ర వీణ వాయిద కళాకారుడైన తెలంగాణలోని నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి దాసరి కొండప్పకు కేంద్రం పద్మశ్రీకి ప్రకటించింది.
అలాగే, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు సైతం పద్మశ్రీ ప్రకటించింది. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరిని పద్మశ్రీకి ఎంపికచేసింది. దేశంలోని తొలి మహిళా మావటి పార్వతి బారువా, అసోంకు చెందిన జగేశ్వర్ యాదవ్లతో సహా 110 మందికి ఈ అవార్డును ప్రకటించింది. ఇదిలా ఉండగా.. గతేడాది ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఆరు పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్. 91 పద్మశ్రీ అవార్డులున్నాయి.
దేశంలోని రెండు అత్యున్నత పౌరపురస్కారాలైన భారతరత్న, పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం 1954లో ప్రారంభించింది. భారత్తో పాటు వివిధ దేశాలకు చెందిన వారికి సైతం అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. వివిధ రంగాల్ల ప్రతిష్ఠాత్మక, అసాధారణ సేవలు అందించినందుకు అవార్డులతో సత్కరిస్తుంది. ఈ అవార్డులను ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తుండగా.. మార్చి, ఏప్రిల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు.