భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సమయంలో వినియోగించే ఆక్సిజన్ కష్టాలు తీరిపోయాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలో అత్యధికంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న భద్రాచలం ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ కష్టాలు తీర్చేందుకు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. దవాఖానలో ఏర్పాటు చేసిన 13వేల కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ను మంత్రి మంగళవారం ప్రారంభించి మాట్లాడారు.
భద్రాచలంలో ఇప్పటికే దాదాపు 100 సిలిండర్ లతో కరోనా రోగులకు ఆక్సిజన్ ను అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా నిమిషానికి 300 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ను తయారు చేసే ఆక్సిజన్ జనరేటర్ ఇప్పటికే వినియోగంలో ఉంది. అలాగే దానికి అదనంగా తాజాగా 13వేల కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు తో కరోనా బాధితులకు ఆక్సిజన్ ను అందించడంతో కోవిడ్ రోగులకు ఆక్సిజన్ కష్టాలు ఉండవన్నారు.
దవాఖానలో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులను పరామర్శించి వారికి ఆత్మస్థైర్యం కల్పించారు. అక్కడ అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కోవిడ్ రోగులకు భోజన ప్యాకెట్స్ ను వారికి అందజేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఐటీడీఏ పీవో గౌతమ్, అదనపు కలెక్టర్ అనుదీప్, డీఎంహెచ్వో శిరీష ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు