లక్నో: వైద్య సౌకర్యాల విషయంలో భారతదేశంలో పట్నాలకు, పల్లెలకు జమీన్ ఆస్మా అంతరముందని ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా యూపీ వంటి వెనుకబడిన రాష్ట్రంలో చాలా ఊళ్లల్లో కుటుంబాలకు కుటుంబాలే కరోనాకు బలవుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలోని ఉత్తరప్రదేశ్ గ్రామం బాసీ పరిస్థితే తీసుకుంటే ఊరి జనాభా 5400 మందిలో నాలుగించ మూడోవంతు మంది కరోనా బారిన పడ్డారు. 30 మంది ఈసరికే చనిపోయారు. ఢిల్లీ నుండి గంటన్నర దూరం. కానీ వైద్య సౌకర్యాలు అంతంతమాత్రం. డాక్టర్లు అరకొరగా ఉన్నారు. ఆక్సిజన్ సిలిండర్ అంటే తెలియదు. సోషల్ మీడియాలో దాతల సహాయం అర్థిద్దామంటే అలాంటివేమీ ఆ ఊరోళ్లకు తెలియవు. ఊరిలో చాలా చావులకు కారణం ఆక్సిజన్ లేకపోవడమేనని కొత్తగా ఎన్నికైన ఊరిపెద్ద సంజీవ్కుమార్ తెలిపారు. జబ్బుపడ్డవారిని తీసుకెళ్లాలంటే జిల్లా ఆస్పత్రి ఒక్కటే దిక్కు. నాలుగు గంటల ప్రయాణం. ఈలోగా చాలామంది చనిపోతున్నారని కుమార్ తెలిపారు. తుడిచిపెట్టుకుపోతున్న కుటుంబాలు, కూలీలు లేక పడావు పడుతున్న పొలాలు, నదుల్లో శవాలు ఇదీ యూపీ పరిస్థితి. 18కి పైగా గ్రామాలు, పట్టణాల ప్రతినిధులతో మాట్లాడిన అనంతరం అధికారులు నిర్ధారించిన దృశ్యం ఇది. సౌకర్యాలు ఉండవు. సరైన లెక్కలు బయటికి రావు. ఈ నేపథ్యంలో సహజంగానే ప్రజల్లో కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ సర్కారు పట్ల, సీఎం యోగి ఆదిత్యనాథ్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. గత పంచాయితీ ఎన్నికల్లో బాసీలో బీజేపీ పరాభవం చవిచూసింది.