కరోనా నియంత్రణకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తున్నదని ఆ సంస్థ చైర్మన్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగం కార్యదర్శి జీ సతీశ్రెడ్డి తెలిపారు. తేజస్ యుద్ధ విమానంలో వాడిన ప్రత్యేకమైన ఆన్బోర్డు ఆక్సిజన్ జనరేషన్ సిస్టం(ఓబ్యాక్స్)టెక్నాలజీతో దవాఖానల్లో నిమిషానికి 1,000 లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తిచేసే ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. కరోనా కట్టడికి డీఆర్డీవో ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ (ఏఐఆర్ హైదరాబాద్) బుధవారం ఆయనను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. మూడో వేవ్ వస్తే ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ)
‘ఏఐఆర్ హైదరాబాద్’ ఇంటర్వ్యూలో డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి
2డీజీ ట్రయల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి?
ఈ ఔషధంపై చాలా ఏండ్లుగా పనిచేస్తున్నాం. 2డీజీ కరోనా వైరస్పై ప్రభావవంతంగా పనిచేస్తున్నదని మా శాస్త్రవేత్తలు మార్చిలో చెప్పారు. పరీక్షలు, పరిశీలనల తర్వాత మేలో సీసీఎంబీలో ఈ ఔషధాన్ని కరోనా వైరస్పై ప్రయోగించాం. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు బాగున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో 2డీజీని వాడేందుకు డీసీజీఐ ఈ నెల 1న అంగీకరించింది.
ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చు?
జూన్లో మార్కెట్లోకి పెద్ద మొత్తంలో ఈ ఔషధాన్ని తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దవాఖానల్లో దీనిని ఇప్పటికే వాడుతున్నారు. ఫలితం చాలా బాగున్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఇది పొడిలా ఉంటుంది. నీళ్లలో కలిపి తాగాలి. ఉదయం సాయంత్రం రెండు సార్లు తీసుకోవాలి. మనిషి బరువును బట్టి ఎంత మోతాదులో తీసుకోవాలనేది వైద్యులు సూచిస్తారు.
ఎలా పనిచేస్తుంది?
ఇది నేరుగా వైరస్పై పనిచేస్తుంది. మానవశరీరంలో వైరస్ పునరుత్పత్తి జరగాలంటే అది సోకిన కణానికి శక్తి (గ్లూకోజ్) అవసరం. 2డీజీ ఔషధం నేరుగా ఆ కణాన్ని చేరి శక్తిని గ్రహించకుండా అడ్డుకొంటుంది. దీంతో వైరస్ పునరుత్పత్తి ఆగిపోతుంది. అప్పటివరకు వృద్ధి చెందిన వైరస్ ఉంటే దానిని సాధారణ రోగనిరోధక శక్తి నిరోధిస్తుంది.
డిప్కొవాన్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు ఎలా పనిచేస్తాయి?
డిప్కొవాన్ అనేది శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయా.. లేవా.. అని పరీక్షించే పరికరం. రక్తం నమూనా తీసుకొని ఈ కిట్లో ఉండే చిన్న స్ట్రిప్పై వేయాలి. 75 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది. జూన్ 1 నుంచి ఈ కిట్ ప్రజలందరికీ రూ.75కే అందుబాటులోకి వస్తుంది.
ఆక్సిజన్ ప్లాంట్ ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది?
తేజస్ యుద్ధ విమానంలో వాడిన ఆన్బోర్డు ఆక్సిజన్ జనరేషన్ సిస్టం(ఓబ్యాక్స్)టెక్నాలజీతో దవాఖానల్లో నిమిషానికి 1,000 లీటర్ల ఆక్సిజన్ను ఉత్పత్తిచేసే ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురానున్నాం.
ఆక్సీకేర్ సిస్టంతో ఏ ప్రయోజనాలు ఉన్నాయి?
ఆక్సీకేర్ సిస్టం అనేది ఎవరైనా మోసుకొని పోగలిగే 10 లీటర్ల సిలిండర్. దానికి ఒక రెగ్యులేటర్, ఒక ఎలక్ట్రానిక్ యూనిట్ను ఫిక్స్ చేస్తాం. ఈ ఎలక్ట్రానిక్ యూనిట్ మనిషి శరీరంలో ఆక్సిజన్ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది. తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా అందిస్తుంది. ఇవి జూన్ మొదటి వారం నుంచి అందుబాటులోకి వస్తాయి.
థర్డ్వేవ్ వస్తుందంటున్నారు.. మీరేం చెప్తారు?
ఇంకోవేవ్ వస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండేందుకు దేశవ్యాప్తంగా డీఆర్డీవో చాలా ప్రాంతాల్లో దవాఖానల నిర్మాణాన్ని చేపట్టింది. కొన్నింటి నిర్మాణం పూర్తయింది. ఆక్సిజన్ ప్లాంట్లను దేశంలో అన్నిచోట్లా ఏర్పాటు చేస్తాం. వెంటిలేటర్లు, ఆక్సిజన్ జనరేటర్లపైనా దృష్టి పెడుతున్నాం.