హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బాయిల్డ్ రైస్ కొనబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బాయిల్డ్రైస్ మిల్లులకు గడ్డుకాలం దాపురించింది. రాష్ట్రంలో వెయ్యికి పైగా బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి. వీటిలో ఎక్కువ శాతం గత పదేండ్లలో ఏర్పాటైనవే. దేశంలో బాయిల్డ్ రైస్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వమే ఈ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించింది. పెట్టుబడిలో 15 శాతం రాయితీలిచ్చింది. వ్యాపారులు ఒక్కొక్క మిల్లు ఏర్పాటుకు రూ.5 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. అప్పటికే ఉన్న రా రైస్ మిల్లులకు మరికొందరు రూ.మూడేసి కోట్ల దాకా ఖర్చు పెట్టి, బాయిల్డ్ రైస్ మిల్లులుగా మార్చారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత, ఆకస్మిక నిర్ణయంతో ఇవన్నీ మూతపడే దుస్థితి దాపురించింది. ఇదే జరిగితే, మిల్లింగ్ రంగానికి రూ.7 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల దాకా నష్టం తప్పదని అంచనా. ఈ రంగం మీద ఆధారపడి హమాలీలు, గుమస్తాలు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఇలా వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్క మిల్లు సుమారు 150 మందికి జీవనాధారంగా మారింది. ఈ మిల్లులు మూతపడితే ప్రత్యక్షంగా 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నది. వారి కుటుంబ సభ్యుల సంఖ్యను, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిని లెక్కిస్తే నష్టపోయేవారి సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుంది. బాయిల్డ్రైస్ మిల్లులను రా రైస్ మిల్లులుగా మార్చుకోవడం తేలికేమీ కాదు. ఇందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడి అంతా వృథా అవుతుంది. బాయిల్డ్ రైస్ మిల్లులను రా రైస్ మిల్లుగా మారిస్తే ధాన్యాన్ని బాయిల్డ్ చేసేందుకు వినియోగించే బ్రాయిలర్, డ్రైయర్, ట్యాంకర్ వంటి పెద్ద పెద్ద పరికరాలు నిరుపయోగంగా మారుతాయి. నిర్వహణలోనూ బాయిల్డ్ రైస్ మిల్లులకి, రా రైస్ మిల్లులకి చాలా తేడా ఉంటుంది. రా రైస్ మిల్లుకు ప్రభుత్వ సహకారం అవసరం లేదు. బాయిల్డ్ రైస్ మిల్లులకు కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని, మిల్లుల్లో బియ్యంగా మారిస్తే, వాటికి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తుంది. బాయిల్డ్ మిల్లు యజమానులకు ఇదే ఆధారం. రా రైస్ మాదిరిగా బాయిల్డ్ రైస్ను నేరుగా వినియోగదారులకు విక్రయించుకోలేరు. కాబట్టి బాయిల్డ్ రైస్ను కేంద్రం తీసుకోకపోతే మిల్లులను మూసేయడం తప్ప మరో మార్గం లేదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో మిల్లింగ్ వ్యవస్థ కుప్పకూలుతుంది. మిల్లులను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడితే ఈ రంగానికి రూ.7వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. సుమారు 2 లక్షల మంది ఉపాధి దెబ్బతింటుంది. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాయి కాబట్టే పెద్ద సంఖ్యలో బాయిల్డ్ రైస్ మిల్లులను ఏర్పాటుచేశాం.కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలి.
–గంప నాగేందర్,రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు