హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 99.4 శాతం భూముల రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ధరణి పోర్టల్ను ప్రారంభించింది.
సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రజలకు సులభమైన, వేగవంతమైన భూ సేవలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పెద్ద రాష్ర్టాల్లోనూ భూముల డిజిటలైజేషన్ సగటున 95 శాతానికిపైనే పూర్తయింది. అస్సాం మాత్రం 76 శాతంతో వెనుకబడి ఉన్నది. నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్లో భాగంగా దేశవ్యాప్తంగా భూముల డిజిటలైజేషన్పై ఎంపీ వేలుస్వామి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.