హైదరాబాద్ సిటీబ్యూరో/శంషాబాద్ రూరల్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి దాదాపు రూ.4 కోట్ల విలువైన 7.695 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
దుబాయ్ నుంచి ఈకే-528 విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడు 4,895 గ్రాముల బంగారాన్ని ఎయిర్ కంప్రెషర్ లోపల పెట్టి తరలిస్తుండగా పట్టుకొన్నారు. అదే విమానంలో వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు లగేజీతో కస్టమ్స్ గ్రీన్ చానల్ను దాటేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 2,800 గ్రాములు ఉన్న 24 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొన్నారు. పట్టుబడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.