హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యా న్ని సాధించేందుకు మిగిలిన 100 రోజులు అత్యంత కీలకమని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ చెప్పారు. రోజూ 2.3 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి, రవాణా చే యాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణాలపై సోమవారం ఆయన హైదరాబాద్లోని సింగరేణిభవన్ నుంచి అన్ని ఏరియాల జీఎంలతో సమీక్ష నిర్వహించారు.
18 రోజులుగా సగటున 2.15 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయడంతోపాటు రికార్డు స్థాయిలో ఒకే రోజు 15.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించినట్టు సీఎండీ వివరించారు. ఇకపై రోజు కు కనీసం 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.