Telangana | హైదరాబాద్/సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మద్యం ఏరులైపారింది. నూతన సంవత్సర వేడుకల వేళ అమ్మకాల జోరు పెరిగింది. 6 రోజుల్లోనే 1,000 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు జరిగినట్టు సమాచారం. డిసెంబర్ 28, 29, 30, 31 తేదీల్లో సుమారు రూ.771 కోట్లకుపైగా ఖజానాకు చేరినట్టు ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒక రు తెలిపారు. డిసెంబర్ 30న ఒక్కరోజు అత్యధికంగా రూ.313 కోట్లు, 31న రూ.150 కోట్లపైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 28, 29 తేదీల్లో రూ.254 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి మూడ్రోజుల్లో 6.51 లక్షల బీర్ కేసులు, 4.80 లక్షల లిక్కర్ కేసులు అమ్మడైనట్టు సమాచారం. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు ఓపెన్గా ఉంచి.. తాగినోళ్లకు తాగినంత మందును విక్రయించారు. డిసెంబర్ 30న రూ.313 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా.. గతేడాది రూ.250 కోట్లకుపైగా విలువైన మద్యం షాపులకు తరలివెళ్లింది. చివరి నాలుగు రోజుల అమ్మకాల విషయానికి వస్తే 2021 డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లో రూ.600 కోట్ల మద్యం అమ్ముడుపోగా.. 2022లో అది రూ.775 కోట్లు ఉండగా.. 2023లో రూ.771 కోట్లకుపైగా మద్యం అమ్ముడైనట్టు విశ్వసనీయ సమాచారం. నూతన సంవత్సర వేడుకల వేళ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. వీటిల్లో ట్రైకమిషనరేట్ల పరిధిలోనే 3,254 కేసులు నమోదయ్యాయి.