ఇబ్రహీంపట్నం, మార్చి 5 : దవాఖాన సూపరింటెండెంట్, ఎస్సైల వేధింపు వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకుని ప్రభుత్వ దవాఖానలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక సివిల్ దవాఖానలో శ్రీనివాస్ అటెండర్గా పనిచేస్తున్నాడు.
అతడి కుమారుడు జయంత్ (22) కూడా అదే దవాఖానలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ విధులకు ఆటంకం కలిగిస్తున్నాడని జయంత్పై సూపరింటెండెంట్ రఘునాథ్ ఇబ్రహీంపట్నం ఠాణలో ఫిర్యాదు చేశాడు. దీంతో జయంత్పై కేసు నమోదు కాగా రఘునాథ్ అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశాడు. తీవ్ర మనస్తాపం చెందిన జయంత్ మంగళవారం ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.