Nagarjuna Sagar | హైదరాబాద్, ఏప్రిల్12 (నమస్తే తెలంగాణ): “ఇవాళ కూడా ఎండీడీఎల్(మినిమమ్ డ్రా డౌన్ లెవెల్) ఎబౌ లెవెల్ సాగర్లో ఏడు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎన్డీడీఎల్ కింద కూడా మరో ఏడెనిమిది టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సాగర్లో ఇప్పుడు కూడా 14-15టీఎంసీల నీటిని వాడుకునే పరిస్థితి ఉంది”.. మార్చి 31న సూర్యాపేట జిల్లా పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నొక్కిచెప్పిన మాటలు. అయినా నాడు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఎదురుదాడికి దిగారు. వర్షాలు లేవు, సాగర్లో నీళ్లే లేవని బుకాయించారు. కానీ, అదంతా అసత్యమేనని కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ తేల్చింది. కేసీఆర్ మాటలే నిజమని తేల్చింది. సాగర్లో వినియోగానికి 14 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించి ఏపీకి 5.5, తెలంగాణకు 8.5 టీఎంసీలు కేటాయించింది. ప్రభుత్వం నిర్వహణ వైఫల్యం వల్లే సాగర్ కింద లక్షలాది ఎకరాలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నదని దీనినిబట్టి స్పష్టమవుతున్నది.
కృష్ణాబేసిన్లోని రిజర్వాయర్లకు ఆశించిన స్థాయిలో జలాలు రాకపోవడంతో ఈ ఏడాది యాసంగి సీజన్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినప్పటికీ చెరువుల కింద, బోర్ల కింద పలువురు రైతులు సాగు చేపట్టారు. నీళ్లు లేవనే సాకుతో ప్రభుత్వం ఈ ఏడాది చెరువులు నింపకపోవడంతో భూగర్భజలాలు వేగంగా అడుగంటి పోయాయి. బోర్లన్నీ ఎండిపోయాయి. ఫలితంగా చెరువులు, బోర్ల కింద సాగుచేసిన పొలాలు ఎండిపోయాయి. బత్తాయి తోటల దిగుబడిపైనా ఇది ప్రభావం చూపింది. సాగర్లో నీళ్లున్నా విడుదల చేయకపోవడమే ఈ దుస్థితికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ సూర్యాపేట జిల్లా పర్యటన తర్వాత ప్రభుత్వం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసింది. ఆ పని మొదటే చేసిఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించి ఉండేదని కాదని రైతులు వాపోతున్నారు. గతంలో తాగునీటి కోసం నీటిని విడుదల చేసేందుకు అనుమతివ్వాలని కోరితే నిరాకరించిన బోర్డు ఇప్పుడు ఎండీడీఎల్ను కుదించి 14టీఎంసీలు అందుబాటులోఉన్నాయని నిర్ణయించి ఇరు రాష్ర్టాలకు జలాలను పంచడం గమనార్హం.
మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలతో కూడిన త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లో సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎండీడీఎల్ను 805 అడుగులు, సాగర్ ఎండీడీఎల్ను 505 అడుగులుగా నిర్ణయించి వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని తేల్చింది. అయినప్పటికీ మే నెలాఖరు వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి గత అక్టోబర్లోనే కేటాయించింది. ఏపీ కోటా మేరకు జలాలను వినియోగించుకోగా, తెలంగాణ కోటాకు మించి ఇప్పటికే 11 టీఎంసీలు వినియోగించుకున్నది.
తాగునీటి జలాల కోసం అదనంగా జలాలు విడుదల చేయాలని కోరుతూ ఇరు రాష్ర్టాలు ఇటీవల బోర్డును కోరాయి. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో త్రిసభ్య కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో మెంబర్ సెక్రటరీ దాదాపు రెండు గంటలకుపైగా చర్చించారు. చివరికి శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి నిల్వలను వినియోగించుకోకూడదని నిర్ణయించారు.
సాగర్ ఎండీడీఎల్ 510 అడుగులు కాగా, గతంలో 505 అడుగుల మేరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో ఎండీడీఎల్ను 500 అడుగులకు తగ్గించారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 510.53 అడుగులు ఉండగా, రిజర్వాయర్లో 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు 17.55 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్తు అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని కమిటీ నిర్ణయించింది.
సమావేశం అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని వెల్లడించారు. రెండు రాష్ట్రాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. సాగర్ నుంచి ఏపీ 5.5, తెలంగాణ 8.5 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. తాగునీటిపై మేలో మరోమారు త్రిసభ్య కమిటీ భేటీ ఉంటుందని వివరించారు. ఏపీలో తాగునీటి కొరత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.