KTR | బలహీనవర్గాలకు లాభం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణనపై తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ప్రసంగించిన కేటీఆర్.. కుల గణనను స్వాగతిస్తున్నామని చెప్పారు. కులగణనకు తీర్మానం చేస్తే సరిపోదని.. దానికి చట్టబద్ధత ఉండాలని సూచించారు. దీనికోసం బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే మరో రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలని పొడిగించాలని అన్నారు. కుల గణన కోసం బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతిస్తామని తెలిపారు. బీసీ డిక్లరేషన్లోని అంశాలు అన్నింటినీ అమలు చేయాలని.. అప్పుడే కులగణన సఫలమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బలహీనవర్గాలైన బీసీల కోసం మంత్రిత్వ శాఖను పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ అన్నారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పెట్టాలని గతంలోనే డిమాండ్ చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖపై రెండుసార్లు తీర్మానాలు చేసి పంపించామని తెలిపారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి కూడా విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఓబీసీ శాఖ పెడితే బీసీలకు రూ.2 లక్షల కోట్లు అయినా వస్తాయని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.