వనపర్తి : ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలం. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించి, పెద్దగూడెంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కోదండరాముల వారి ఆలయంలో పూజలు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
కడుకుంట్ల గ్రామంలో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీని సందర్శించి మంత్రి మాటాడారు. దేశంలో వంట నూనెల డిమాండ్ కు తగినంతగా నూనెగింజల సాగు లేదు. ఏటా రూ.80 వేల కోట్ల విలువైన పామాయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. దేశంలో నూనె, పప్పుగింజలకు మార్కెట్లో డిమాండ్ ఉంది.
మార్కెట్లో వంట నూనెల డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. వచ్చే జూన్ తర్వాత మూడు లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు రైతులకు మొక్కలు సిద్ధమయ్యాయి. సంప్రదాయ పంటల సాగుతో నష్టపోతున్న రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలని ఆయన సూచించారు.