హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తీవ్రవాదం, మతతత్వ శక్తులు, ఇతర నేరాలు పెరగకుండా పోలీసులు పటిష్ఠమైన చర్యలు తీసుకొంటున్నారని హోం మంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. శాంతిభద్రతల నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమర వీరులకు రాష్ట్ర ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున సలామ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఘోషామహల్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన సభకు హోంమంత్రి మహమూద్అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరవీరుల స్తూపం వద్ద డీజీపీ ఎం మహేందర్రెడ్డితో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పోలీస్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వహణలో అసువులు బాసిన 264 మంది పోలీసులకు నివాళులు అర్పించారు. గత ఎనిమిదేండ్లలో హైదరాబాద్ నగరంతోసహా రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ మత ఘర్షణలు తలెత్తకుండా చూశామని చెప్పారు. బోనాలు, మొహర్రం, దసరా, వినాయకచవితి వంటి పండుగలను ప్రశాంతంగా నిర్వహించడంలో రాష్ట్ర పోలీసులు చూపిన పనితీరు ప్రశంసనీయమని పేరొన్నారు.
శాంతిభద్రతల నిర్వహణలో తెలంగాణ పోలీస్శాఖ దేశానికి ఆదర్శంగా ఉన్నదని అన్నారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో పోలీసులు విధి నిర్వహణకు మరింత పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ తెలంగాణ పోలీస్ ముందంజలో ఉన్నదని అన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే తరహా సేవ అనే సూత్రంతో రాష్ట్రంలో జవాబుదారీతనం, పారదర్శకత, బాధ్యతాయుతమైన, స్నేహపూర్వక సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ప్రేరణతో పోలీసుశాఖ తరఫున శక్తివంచన లేకుండా నిరంతరం కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గత కొన్నేండ్లుగా నిలుస్తున్నదని, ఈ గుర్తింపు పొందడంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రధాన అంశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ అభిలాషబిస్త్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.