కమ్మర్పల్లి, ఫిబ్రవరి 16: సామాజిక ఆరోగ్య కార్యకర్త.. తెలంగాణ రాక ముందున్న ఈ పేరుకు హోదా, గౌరవం నామమాత్రమే. నిరాశపూరిత వేతనాలు. అలాంటివారికి ‘ఆశా’జ్యోతిలా నిలిచారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆకాంక్షలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న సీఎం.. ఆశాకార్యకర్తల జీతాలు పెంచి మనసున్న నాయకుడయ్యారు. ఫలితంగా వారు కొవిడ్ సంక్షోభంలోనూ ధైర్యంగా సేవలందించారు. రూ.6 వేలు మాత్రమే ఉన్న వేతనాన్ని.. రూ.9,750కి పెంచారు. మహిళా, శిశు, కుటుంబ సంక్షేమం, ఆమ్మఒడి, కేసీఆర్ కిట్, సంపూర్ణ పౌష్టికాహారం వంటి కార్యక్రమాలతో ఆశ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చారు. డ్రెస్కోడ్తో ఏటా రెండు జతల చీరలు అందించే ఏర్పాటు చేశారు. బీఎస్ఎన్ఎల్ సిమ్కార్డులు అందించి రాష్ట్రంలో ఒక ఆశ కార్యకర్త మరో ఆశకార్యకర్తతో ఎక్కడి నుంచైనా మాట్లాడే అవకాశం కల్పించారు. తాజాగా ఉచిత స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన ఆశ వర్కర్ మంజుల మాట్లాడుతూ ‘మా పాలిట సీఎం కేసీఆర్ ఆశాజ్యోతి అయ్యారు. మా పనికి గుర్తింపును పెంచారు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న కాలంలో అంతంతమాత్రం గౌరవం కూడా దక్కక బాధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. వేతనపెంపుతో ఆర్థిక భరోసా, ఆత్మగౌరవం పెరిగాయి. సీఎం సార్ మేలును ఎప్పటికీ మరిచిపోము’ అన్నారు. ‘మా విధులను, బాధలను అర్థం చేసుకొని సీఎం సార్ వేతనాలను పెంచారు’అని ఏర్గట్ల మండలం బట్టాపూర్కు చెందిన ఆశ వర్కర్ వర్ష పేర్కొన్నారు.
మా పనికి గుర్తింపునిచ్చారు!
– ఆశావర్కర్ మంజుల