హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కౌన్సిళ్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మన రాష్ట్రంలోని మొత్తం ఆరు కౌన్సిళ్లలో రెండు దేశంలోని అత్యుత్తమ కౌన్సిళ్ల జాబితాలో నిలవడమే ఇందుకు నిదర్శనం. కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి నారాయణ్రాణే ఇటీవల ఈ రెండు కౌన్సిళ్ల అధ్యక్షులకు ఢిల్లీలో పురస్కారాలను అందజేశారు. డీలర్లు, దుకాణదారుల నుంచి ఎంఎస్ఎంఈలకు వసూలు కావాల్సిన బకాయిల్లో జాప్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ ‘ఎంఎస్ఎంఈ సమాధాన్’ పేరుతో 2017లో ఓ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఈ మేరకు చట్టం చేయడంతో రాష్ర్టాలన్నీ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల (ఎంఎస్ఈఎఫ్సీ)ను ఏర్పాటు చేశాయి. మన రాష్ట్రంలో 2017లో నాలుగు, తాజాగా మరో రెండు కలిపి మొత్తం 6 కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో కౌన్సిల్కు కొన్ని జిల్లాల చొప్పున కేటాయించి మెజిస్టీరియల్ అధికారాలతో పరిశ్రమల శాఖ సహాయ సంచాలకుడి స్థాయి అధికారిని అధ్యక్షుడిగా నియమించారు. ఇటీవల కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ దేశంలోని అత్యుత్తమ కౌన్సిళ్లను ఎంపికచేసి సత్కరించింది. వీటిలో మేడ్చల్, రంగారెడ్డి కౌన్సిళ్లు ఉన్నాయి. గత నాలుగున్నర ఏండ్లలో ఈ కౌన్సిళ్లకు దాదాపు 2,500 ఫిర్యాదులు అందగా.. 900 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి.
2 కొత్త కౌన్సిళ్ల ఏర్పాటు
ఇప్పటివరకు రాష్ట్రంలోని 33 జిల్లాలను రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, ఖాజీపేట ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల పరిధిలో కొనసాగించారు. తాజాగా యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో కౌన్సిళ్లను ఏర్పాటు చేయడంతో ఈ రెండు జిల్లాలతోపాటు కొన్ని పరిసర జిల్లాలు వీటి పరిధిలోకి వచ్చాయి.
రూ.3 కోట్లు దాటితే ఐఏఎంసీకి బదిలీ
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు డీలర్లు, దుకాణదారుల నుంచి రావలసిన బకాయిలు రూ.3 కోట్లు దాటితే ఇకపై అలాంటి వివాదాలను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు బదిలీ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఐఏఎంసీతో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది. సాధారణంగా ఇలాంటి వివాదాల పరిష్కారానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేలా చూసేందుకు ఐఏఎంసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల విధివిధానాలు
బయ్యర్లు, డీలర్లు, దుకాణదారులు 45 రోజుల్లోగా బకాయిలు చెల్లించకుంటే ఎంఎస్ఎంఈలు ఈ కౌన్సిళ్లను ఆశ్రయించవచ్చు.
నేరుగా కౌన్సిల్కు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు.
కౌన్సిల్కు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా కేసును పరిష్కరించేలా చట్టంలో కట్టుదిట్టమైన నిబంధనలు పొందుపరిచారు.
కౌన్సిల్ ఆదేశాల ప్రకారం ఎంఎస్ఎంఈలకు బయ్యర్ చెల్లించాల్సిన బకాయిలను వడ్డీతోసహా నిర్ణీత గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ అతను కౌన్సిల్ తీర్పుతో విభేదించి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనుకున్నా మొత్తం బకాయిలో 75% సొమ్మును కౌన్సిల్కు డిపాజిట్ చేసిన తర్వాతే పైకోర్టుకు వెళ్లేందకు అవకాశం ఉంటుంది. లేనిపక్షంలో పైకోర్టుకు వెళ్లే ఆస్కారం లేకుండా చట్టాన్ని రూపొందించారు.