మహబూబ్నగర్ : జిల్లా నుంచి పేదరికం పారద్రోలి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా.. జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
శుక్రవారం ఆయన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఒకేషనల్ విద్యార్థులకు ఉద్దేశించి నిర్వహించిన అప్రెంటీస్ షిప్, జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2015 నుండి ఇప్పటివరకు ఒకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం 1500 నుండి 4,500 వరకు ఉద్యోగాలు కల్పించామని అన్నారు . ఇటీవల జిల్లాలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 2,500 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆయన వెల్లడించారు.
శుక్రవారం నాటి జాబ్ మేళాకు సుమారు 50 కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని, ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు. అంతేకాక ఎంపికైన కొంత మందికి నియామక పత్రాలు అందజేశారు.
ఉద్యోగం రావడం ద్వారా సమాజంలో గౌరవం, గుర్తింపు వస్తుందని, ఒకేషనల్ విద్యార్థులతో పాటు,ఇతరులకు కూడా నైపుణ్యాల అభివృద్ధి కోసం శిక్షణ ,కోచింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒకేషనల్ విద్యార్థుల కోసం రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించిన భవనాన్ని వినియోగంలో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ముడాచైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, ఇంటర్మీడియట్ రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, ఒకేషనల్ విద్య ట్రైనింగ్ అధికారి విజయకుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అనిల్ కుమార్, డీఎస్పీ మహేష్ పాల్గొన్నారు.