యాదగిరిగుట్ట, నవంబర్ 13: ఎస్సీ వర్గీకరణ కోసం 29 ఏండ్లుగా పోరాడుతుంటే 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి బీజేపీ మోసం చేసిందని, గాంధీభవన్ ఆవరణలో మాదిగ బిడ్డల ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమైందని, ఈ రెండు పార్టీలు మాదిగలకు శాశ్వత శత్రువులేనని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాదిగల వర్గీకరణ బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్టు గుర్తుచేశారు. సికింద్రాబాద్లో జరిగిన విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీది రాజకీయ ప్రసంగమే తప్ప, మాదిగల ప్రయోజనం కోసం ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. కమిటీల పేరుతో కాలయాపన ఎందుకని, ప్రధాని హోదాలో మోదీ ఎస్సీ వర్గీకరణపై ఎందుకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గెలిస్తే వర్గీకరణ అంశం ముందుకు వెళ్తుందని, సీఎం కేసీఆర్ మాదిగలకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, మాదిగలు అభివృద్ధిలోకి రావాలన్నా కేసీఆర్తోనే సాధ్యమని పేర్కొన్నారు.