హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా తెలంగాణ పోలీసులు అందుబాటులోకి తెచ్చిన ‘హాక్ఐ’ మొబైల్ అప్లికేషన్ 31 లక్షల యూజర్లతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ పోలీసులు వినియోగిస్తున్న ‘లాస్ట్ రిపోర్ట్’ యాప్ 1.1 కోట్ల యూజర్లతో ప్రథమ స్థానంలో ఉన్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రజల సౌకర్యార్థం వివిధ రాష్ర్టాల పోలీసులు వినియోగిస్తున్న మొబైల్ యాప్లకు ప్రజల్లో ఉన్న ఆదరణపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ విభాగం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. తెలంగాణ పోలీసులు హాక్ఐ యాప్ను 2014లో అందుబాటులోకి తెచ్చారు.
తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సేవలు ప్రారంభించి, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. పోలీసులు సైతం ఉల్లంఘనలకు పాల్పడితే వారిపై ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉండటం ఈ యాప్ ప్రత్యేకత. సాఫీ ప్రయాణాల కోసం ఈ యాప్ ద్వారా పోలీసు సేవలను ఉపయోగించుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఎస్వోఎస్ బటన్, అత్యవసర కాంటాక్టులు, కమ్యూనిటీ పోలీసింగ్, ఫిర్యాదుల స్టేటస్, ఇంటి కిరాయిదారులు, సెక్యూరిటీ, పని మనుషులకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తదితర సేవలను ఆన్లైన్లో పొందవచ్చు. ఏవైనా వస్తువులు, డాక్యుమెంట్లు పోగొట్టుకొంటే పోలీసుస్టేషన్కు వెళ్లకుండానే ఈ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ 72 గంటల్లో మెయిల్ బాక్స్కు వస్తుంది. కేంద్ర హోంశాఖ నివేదిక-2021 ప్రకారం 31,00,663 యూజర్లు ఉండగా, సోమవారం నాటికి ఈ సంఖ్య 42,47,309కు పెరిగింది. హోంశాఖ నివేదిక రూపొందించిన తరువాత యూజర్ల సంఖ్య 11 లక్షలకుపైగా పెరగడం విశేషం.
హాక్ఐలో మరిన్ని ఫీచర్లు
హాక్ఐ యాప్లో మరిన్ని ఫీచర్లను జోడించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వాహనాల చోరీకి సంబంధించిన డాటా, సైబర్ నేరాలు, షీ టీమ్స్, ట్రాఫిక్ తదితర సమాచారం ప్రజలకు వేగంగా అందించేలా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం. యాప్ ద్వారా మహిళల భద్రత, సురక్షిత ప్రయాణాలు, అత్యవసర సర్వీస్లకు సంబంధించిన సేవలు ఇప్పటికే లభిస్తున్నాయి. ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ యాప్లలో హాక్ఐ త్వరలో దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకుంటుందని ఆశిస్తున్నాం.
– సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్