కరీంనగర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని, అందుకు అవసరమైన నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సమకూర్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. వానాకాలం పంట సేకరణకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఇవాళ కరీంనగర్లో మాట్లాడిన ఆయన.. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాల్సి ఉందని తెలిపారు. దాదాపు 7,100కు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామని, అవసరమైతే మరో వందవరకు ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్లకు నిర్ధిష్ట ఆదేశాలు ఇచ్చామని మంత్రి చెప్పారు.
ఈసారి పంట సేకరణకు 25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, ఇప్పటికే 14 కోట్ల గన్నీ బ్యాగులను సేకరించామని గంగుల తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్లు, పాడీ క్లీనర్లు, టార్పాలిన్లు తదితర సామాగ్రి అందుబాటులో ఉందన్నారు. రాబోయే రెండున్నర నెలలు ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఎక్కడ ఎలాంటి అవసరమున్నా తక్షణం స్పందించే విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశామని ఆయన చెప్పారు.
చరిత్రలో తొలిసారి అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాకముందు 2,200 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉండేవని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేవారని ఆయన గుర్తుచేశారు. రైతుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని అన్నారు. వానాకాలం పంట FCI కి అందజేస్తామన్నారు. తప్ప, తాలు సమస్య రాకుండా ఆరిన ధాన్యాన్ని మూడు రోజుల తర్వాత రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు.