హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అడవులు దేశానికి అధ్యయన కేంద్రాలుగా మారాయి. ఆరేండ్ల క్రితం ఎడారిని తలపించిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమంతో నేడు జీవం పోసుకొన్నది. పిచ్చి మొక్కలన్నీ పోయి.. పూల, ఫల, ఔషధ, ఇతర వృక్షాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని సింగాయపల్లి అడవి పచ్చదనానికి చిరునామాగా నిలిచింది. దేశంలోని అన్ని రాష్ర్టాల అటవీ అధికారులు, ఐఏఎస్ అధికారులకు అధ్యయన కేంద్రంగా మారింది.
మాడల్గా సింగాయపల్లి..
తెలంగాణ ఏర్పడే నాటికి ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో కేవలం 14 శాతం మేరకే దట్టమైన అడవులు ఉండేవి. అడవుల విస్తీర్ణం పెంపుదలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని సింగాయపల్లి అడవిని మాడల్గా తీసుకొన్నారు. అటవీ పునరుద్ధరణ కార్యక్రమం ఫలితంగా నాలుగేండ్లకే 157 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ముండ్లకంపల ప్రాంతాన్ని మహాఅడవిగా అటవీ అధికారులు మార్చారు. పునరుజ్జీవం పోసుకొన్న ఈ అడవిని 2019 ఆగస్టు 21న సీఎం కేసీఆర్ సందర్శించారు. అనంతరం 2020 ఫిబ్రవరి 18న మంత్రులు, మున్సిపల్ చైర్మన్లు, అదే ఏడాది అక్టోబర్ 16న ఐఏఎస్ లు, సీఎస్, నవంబర్ 18న డీజీపీ, పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు క్రమంగా ఇతర రాష్ర్టాలకు చెందిన అటవీ అధికారులు, ఐఏఎస్ అధికారులు అధ్యయనం నిమిత్తం వస్తున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పల్లెప్రకృతి వనాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రతిపల్లె, పట్టణం పచ్చదనంతో ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్నాయి.
ఆరేండ్లలో 1,360 చ.కి.మీ. విస్తీర్ణం పెరుగుదల
తెలంగాణ ప్రభుత్వం 2015 నుంచి రాష్ట్రంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలతో అడవుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. హరితహారం, అటవీ పునరుద్ధరణ, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అటవీ విస్తీర్ణం, పచ్చదనం గణనీయంగా పెరిగింది. 2015లో 19,854 చదరపు కిలోమీటర్లుగా ఉన్న అటవీ విస్తీర్ణం 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు పెరుగడం విశేషం. అంటే దాదాపు 1,360 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది. దీనితో రాష్ట్రంలో పచ్చదనం 18 శాతం నుంచి 31.6 శాతానికి చేరుకొన్నది. అదేవిధంగా చెట్ల విస్తీర్ణం 2015లో 2,549 చదరపు కిలోమీటర్లు ఉండగా 2021 నాటికి 2,848 చదరపు కిలోమీటర్లకు చేరింది. 334 చదరపు కిలోమీటర్ల చెట్ల విస్తీర్ణం పెరిగింది.
ఏఎన్ఆర్తో పునరుజ్జీవం
అసిస్టెడ్ నేచురల్ రీజనరేషన్ (ఏఎన్ఆర్) అనేది క్షీణించిన గడ్డిభూములు, పొదలతో కూడిన వృక్షసంపద నుంచి ద్వితీయ అటవీ స్థాపనను పెంపొందించడానికి చేపట్టిన కార్యక్రమం. అంతర్లీనంగా ఉన్న తల్లి చెట్లను, వన్యప్రాణులను రక్షించడం, పోషించే పద్ధతి. ఈ పద్ధతిలో సింగాయపల్లి అడవికి అటవీ అధికారులు జీవం పోశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు కార్యరూపం దాల్చి ఈ అడవి ప్రస్తుతం దేశానికి ఆదర్శంగా నిలిచింది.
పునరుజ్జీవం.. సంరక్షణ
అడవులను పునరుద్ధరించే లక్ష్యంతో 2017లో ఏఎన్ఆర్ను చేపట్టారు. కొత్తగా మొకలు నాటి, విత్తనాలు చల్లి సహజంగా పెరిగే వాతావరణాన్ని సృష్టించారు.
కల్చరల్ ఆపరేషన్: చెట్లకు అడ్డుగా నిలిచే పిచ్చిమొకల్ని, లంబడి, గోరంత వంటి ముండ్ల రకం మొకలను, వృక్షాలు ఎదగకుండా అల్లుకుపోయిన తీగలను తొలగిస్తారు.
సింగిలింగ్ పనులు: ఒకేచోట ఎకువగా ఉన్న చెట్లలో ఒకటి, రెండింటిని నరికేసి మిగతావి బలంగా, దృఢంగా పెరిగేలా చూడటమే సింగిలింగ్.
కాపిసింగ్: నరికివేతకు గురై మోడుబారిన వృక్షాల మొదళ్లను భూమి వరకు నరికేసి సహజంగా తిరిగి చిగురించేలా చేయడం.
క్యాంప్ కూలీలు: అటవీ పునరుజ్జీవ పనులకు ఛత్తీస్గఢ్, ఒడిశా, భద్రాచలం ప్రాంతాల నుంచి ‘క్యాంపు’ కూలీలను పిలిపించారు. ప్రతి హెక్టారుకు రూ.6,200 చొప్పున వీరికి చెల్లించారు.
మంకీ ఫుడ్ కోర్టులు: సింగాయపల్లి అడవిలో 25 రకాలకుపైగా పండ్ల మొకలను పెంచుతున్నారు. కోతులు ఊర్లపై పడకుండా ఇవి మంకీఫుడ్ కోర్టుల్లా మారుతున్నాయి.
యాదాద్రి మాడల్: అడవిలో ఖాళీ ప్రదేశాలను చిట్టడవులుగా మార్చేలా 50 వేల మొకల్ని యాదాద్రి మాడల్ విధానంలో మొకలు నాటారు.
కందకాలు: సహజసిద్ధ అడవి చుట్టూ కందకాలు తవ్వించారు. పశువులు చొరబడకుండా, అడవి నరికివేతకు గురికాకుండా ఇవి దోహదపడుతున్నాయి.
ఫైర్ లైన్లు: అటవీప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు రాజీవ్ రహదారి పక నుంచి అడవి వరకు 3 మీటర్ల నుంచి 5 మీటర్ల వెడల్పుతో ఫైర్ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ లైన్లో చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తారు.