Pigeons | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): పక్షులలో పావురాలు తెలివైనవని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. వందల ఏండ్ల క్రితమే సమాచార చేరవేతకు ఉపయోగించేవారు. కానీ, ఇవి మనం ఉహించినదానికంటే చాలా తెలివైనవని, శిక్షణ ఇస్తే ఏ విషయాన్నైనా నేర్చుకోగలవని శాస్త్రవేత్తలు తేల్చారు. కృత్రిమ మేధస్సు (ఏఐ)లా పావురాలు కూడా కొన్ని సమస్యలను పరిష్కరించగలవని కొలంబస్ ఒహియో స్టేట్ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
సమస్యా పరిష్కారానికి ఏఐలో ఉపయోగించే ‘బ్రూట్ ఫోర్స్’ పద్ధతిని పావురాలు పాటిస్తున్నాయని, కృత్రిమ మేధస్సుతో పనిచేసే కంప్యూటర్, పావురం రెండూ ఒకే రకమైన పద్ధతిలో నేర్చుకుంటాయని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. 4 రకాల పావురాలను ఎంపికచేసి కొన్ని టాస్క్లను ఇవ్వడంతోపాటు ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో వేర్వేరు పరీక్షలు నిర్వహించడంతో అవి త్వరగా ఆయా పనులను నేర్చుకుని టార్గెట్ను చేరుకున్నాయని, లెక్కించడం నుంచి రొమ్ము క్యాన్సర్ను గుర్తించడం వరకు పావురాలు పలు రకాల పనులు చేయగలవని వివరించారు. ప్రత్యేకించి కొన్ని విషయాలను మనిషి కంటే సమర్థంగా నేర్చుకోగలిగాయని, అవి నేర్చుకునే విధానం కృత్రిమ మేధస్సును పోలి ఉన్నదని పేర్కొన్నారు.