హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. క్యాంపస్ ఆవరణలోని ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుందని వెల్లడించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. ఓయూ గెస్ట్హౌజ్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్లతో కలిసి వీసీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరై స్నాతకోత్సవ ఉపన్యాసాన్ని వెలువరిస్తారని తెలిపారు.
అక్టోబర్ 2021 నుంచి జులై 2022 మధ్య పరీక్షలు పాసైన వారికి మాత్రమే పీహెచ్డీ పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తామన్నారు. మొత్తం 55 బంగారు పతకాలను 31 మంది విద్యార్థులు సాధించారని, వారిలో నలుగురు అబ్బాయిలు కాగా, 27 మంది అమ్మాయిలు కావడం విశేషమన్నారు. 260 మంది పీహెచ్డీ పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 96 మంది పురుషులు కాగా, 143 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అత్యధికంగా 76 మంది ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ నుంచి, 35 మంది ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి పీహెచ్డీ పట్టాలు అందుకోనున్నారన్నారు.