ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 30: ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక ఐఎస్వో ధ్రువీకరణను సాధించింది. ఆయా విభాగాల్లో అత్యుత్తమ విధానాలు, కార్యకలాపాలు, మౌలిక వసతులకు ఈ గుర్తింపు లభించింది. హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు రోజులపాటు రెండు దశల్లో ఈ గుర్తింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది.
హెచ్వైఎం ఎండీ ఆలపాటి శివయ్య నేతృత్వంలోని బృందాలు 53 విభాగాలు, వివిధ పరిశోధనా కేంద్రాలు, కార్యాలయాల్లో విస్తృతంగా పర్యటించి, ఆడిట్ నిర్వహించారు. విద్య, పరిపాలన, పర్యావరణ సుస్థిరత, నాణ్యతా ప్రమాణాల్లో శ్రేష్ఠతను కనబరిచి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది. ఎనర్జీ ఆడిట్-ఐఎస్వో 50001:2018, పచ్చదనం, పర్యావరణం ఆడిట్-ఐఎస్వో 14001:2015, నాణ్యతా ప్రమాణాలు- ఐఎస్వో 9001:2015, అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆడిట్, జెండర్ సెన్సిటైజేషన్ విభాగాల్లో ఐఎస్వో గుర్తింపు ధ్రువీకరణ సర్టిఫికెట్ను ఓయూ అధికారులు హెచ్వైఎం ఎండీ నుంచి స్వీకరించారు.