సుల్తాన్బజార్, ఫిబ్రవరి 22: అతడి వయసు 23 ఏండ్లు.. బరువు 220 కిలోలు.. అధిక బరువుతో కూర్చోలేడు.. నడవలేడు.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.. ఈ సమస్యతో దవాఖానలో చేరిన అతడికి పైసా ఖర్చు లేకుండా అరుదైన శస్త్రచికిత్స చేసి 70 కిలోల కొవ్వును తొలగించారు ఉస్మానియా వైద్యులు. వివరాల్లోకెళితే.. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మహేశ్నగర్ కాలనీకి చెందిన మునీందర్ సింగ్ (23) ఐదేండ్ల వయసు నుంచే స్థూలకాయంతో బాధపడుతున్నాడు. మునీందర్ను కుటుంబసభ్యులు రెండు నెలల కిందట ఉస్మానియా దవాఖానలో చేర్పించారు. అధిక రక్తపోటు, మధుమేహంతో మునీందర్ బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు.
బేరియాట్రిక్ సర్జరీ చేసి కొవ్వును తొలగించారు. కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిపోయేందుకు చిన్న పేగును కత్తిరించినట్టు సర్జికల్ ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ సీహెచ్ మధుసూదన్ తెలిపారు. ప్రస్తుతం మునీందర్కు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందేమీ లేదని, పండ్ల రసాలు, ఆహార పదార్థాలు తింటున్నాడని తెలిపారు. ఉస్మానియాలో తొలిసారి ఈ సర్జరీ నిర్వహించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ అరుదైన శస్త్రచికిత్సలు చేయగలుగుతున్నామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ వెల్లడించారు.