వెంగళరావునగర్, ఆగస్టు 9: సినిమా కథకు ఏమాత్రం తీసిపోని కుటుంబ కథ ఇది.. కన్నతండ్రి కాలం చేశాడు. ఆడబిడ్డలని భారంగా భావించి కన్నతల్లి ఎటో వెళ్లిపోయింది. ముగ్గురు పిల్లలు అనాథలై రోడ్డునపడ్డారు. రెక్కలు తెగిన పక్షుల్లా తలోదిక్కుకు చేరారు. ఆకలికి తాళలేక భిక్షమెత్తుకొన్నారు. ఆ పసిమొగ్గల అవస్థలు చూసి కొందరు మనసున్న అధికారులు చేరదీశారు. ఇద్దరిని ఒకచోట, మరొకరిని వేరేచోట షెల్టర్హోమ్స్లో చేర్పించారు. నాలుగేండ్లు తమ తోబుట్టువులను తలుచుకొని ఒంటరిగా కాలం వెళ్లదీసిన ఆ బాలికలు ఓ సైన్స్ఫెయిర్ మూలంగా మళ్లీ ఒక్కటయ్యారు. ఈ చిన్నారుల కథ ఉన్నతాధికారులకు కూడా కన్నీరు తెప్పించింది.
కుటుంబం చెల్లాచెదరు
హైదరాబాద్లోని కూకట్పల్లి ఎల్లమ్మబండలో జగన్, తులసి దంపతులు జీవిస్తుండేవారు. వారికి అమ్ములు (12), శ్రావణి (10), దుర్గ (7) అనే ముగ్గురు ఆడపిల్లలు. నిరుపేద అయిన జగన్ కత్తులకు పదునుపెట్టే పని చేస్తూ భార్యాబిడ్డలను పోషించుకునేవాడు. నాలుగేండ్ల క్రితం అనుమానాస్పదస్థితిలో చెరువులో జగన్ మృతదేహం పోలీసులకు లభించింది. భర్త చనిపోవడంతో ముగ్గురు ఆడపిల్లను పోషించలేక ఆ ఇల్లాలు ఇల్లు విడిచి ఎటో వెళ్లిపోయింది. దాంతో ఆ చిన్నారుల జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. తల్లితండ్రి దూరమవటంతో దిక్కులేని పక్షులయ్యారు. చిన్న పాప దుర్గను నానమ్మ చేరదీసినా వయోభారంతో ఆ వృద్ధురాలు కూడా కొద్దిరోజులకే చనిపోయింది. దాంతో ఆ పాపను పోలీసులు శిశువిహార్లోని బాలసదన్లో చేర్పించారు. మరోవైపు పెద్దపిల్లలు అమ్ములు, శ్రావని నా.. అనేవారు లేక, ఆకలికి తాళలేక బిచ్చమెత్తుకుంటుండటాన్ని గమనించిన పోలీసులు మారేడ్పల్లిలోని హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ ఫౌండేషన్లో చేర్పించారు. అలా నాలుగేండ్లు గడిచిపోయాయి. తాజాగా నగరంలోని ఓ షెల్టర్హోమ్స్లో జరిగిన సైన్స్ ఫెయిర్లో ఓ బాలిక చిన్నపాప దుర్గను చూసి ముగ్గురి పోలికలు ఒకేలా ఉన్నాయని గుర్తించింది. దుర్గ ఫొటోను చూసిన అక్కలు తమ చెల్లెలే అని గుర్తుపట్టారు. చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి విజయ్భాస్కర్ ఈ విషయాన్ని జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు.
డీఎన్ఏ టెస్టుతో కలయిక
అక్కేశ్వర్రావు చొరవతో ముగ్గురు ఆడపిల్లల డీఎన్ఏ నమునాలను సేకరించి అధికారులు టెస్టు చేయించటంతో అందరిదీ ఒకటే అని తేలింది. దాంతో వారు ముగ్గురు తోబుట్టువులని అధికారులు నిర్ధారించారు. వారిని ప్రస్తుతం హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ ఫౌండేషన్లో ఉంచారు. జీవితంలో మళ్లీ కలుస్తామన్న ఆశ వదిలేసుకున్న ఆ అక్కాచెల్లెళ్లు తమ జీవితాల్లో అద్భుతమే జరిగిందని నమ్ముతున్నారు. ఇనాళ్లు ఎలాగున్నావ్ చెల్లెమ్మా అంటూ అక్కలు చెల్లిని గుండెలకు హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఇద్దరు అక్కలను చూసి చెల్లి దుర్గ ఆనందంతో పొంగిపోతున్నది. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని ఆ పిల్లలకు అన్నీతామే అయ్యి చూసుకుంటామని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి విజయభాస్కర్ తెలిపారు. తోబుట్టువులకు ఒక్కచోటికి చేర్చటంలో అక్కేశ్వర్రావు పడ్డ తాపత్రయాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ప్రశంసించారు. అక్కేశ్వర్రావు కృషిని అభినందిస్తూ స్మితా సభర్వాల్ ట్విట్టర్లో పోస్టు పెట్టారు. ప్రభుత్వ హోమ్స్లో ఆశ్ర యం పొందే పిల్లలకు డీఎన్ఏ టెస్టులు చేయాలని దివ్యా దేవరాజన్ నిర్ణయించటం అభినందనీయమని అక్కేశ్వర్రావు అన్నారు.