ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పేరివిజన్ కమిటీ (పీఆర్సీ)ని ఏర్పాటుచేయడం, 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామం. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు.
– మంత్రి హరీశ్రావు
PRC | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి వారికి తీపి కబురు అందించింది. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్లు పెంచేందుకు వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ని నియమిస్తున్నట్టు ప్రకటించింది. పీఆర్సీ నివేదిక వచ్చేంత వరకు మూల వేతనంపై ఐదు శాతం మధ్యంతర భృతి (ఐఆర్) చెల్లించనున్నట్టు తెలిపింది. అక్టోబర్ నెల నుంచే ఐఆర్ను వర్తింపజేయనున్నట్టు పేర్కొన్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చైర్మన్గా పీఆర్సీ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం జీవో -159 జారీచేశారు. ఈ కమిటీలో సభ్యుడిగా మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ రామయ్యకు చోటు కల్పించారు. ఈ కమిటీ ఆరు నెలల్లోపు ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని నిర్దేశించారు.
అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీని వర్తింపజేయనున్నారు. పీఆర్సీ బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని ఏర్పాటుచేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. వేతన సవరణలను సిఫారసు చేసే క్రమంలో తెలంగాణ ఉద్యోగుల ప్రస్తుత పేస్కేల్స్, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను పరిగణనలోకి తీసుకోవాలని పీఆర్సీకి సూచించారు. రాష్ట్ర ఆదాయ వృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ హామీలు, భవిష్యత్తు పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలనూ పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం గుడ్న్యూస్ చెప్పడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
నాలుగు నెలలకే కొత్త పీఆర్సీ
ఉద్యోగుల వేతన సవరణపై గతంలో ప్రభుత్వం నియమించిన సీఆర్ బిశ్వాల్ కమిషన్ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే అత్యంత వేగంగా కొత్త పీఆర్సీని ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఐఆర్, పీఆర్సీల కోసం ఉద్యోగులు ఆందోళనలకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగుల పక్షాన ఉండే తెలంగాణ సర్కారు.. అతి తక్కువ వ్యవధిలోనే పీఆర్సీని నియమించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఆర్ బిశ్వాల్ కమిటీ మొదటి పీఆర్సీ కాగా, తాజాగా శివశంకర్ అధ్యక్షతన ఏర్పాటైనది రెండవది. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, ఉద్యోగుల వేతనాలు, జీవన వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని సిఫారసులు చేస్తుంది. అంతకుముందే రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. అనంతరం పీఆర్సీ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించి, వేతన సవరణ అమలయ్యేలా సిఫారసు చేస్తుంది. ఆ సిఫారసు ప్రకారం వేతన సవరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, పీఆర్సీ జీవోను విడుదల చేస్తుంది.
అక్టోబర్ ఒకటి నుంచే ఐఆర్ అమలు..
పీఆర్సీతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఐదు శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. ఒక పీఆర్సీ సిఫారసులు ఆలస్యమయ్యే అవకాశాలున్న అన్ని సందర్భాల్లోనూ ఐఆర్ ప్రకటించడం అనవాయితీగా వస్తున్నది. పీఆర్సీలో ఫిట్మెంట్ ఖరారు చేసిన తర్వాత, ఈ ఆలస్యమైన కాలానికి ఈ ఐఆర్ను మినహాయించి, మిగతా మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తారు. ప్రస్తుతానికి బేసిక్ పేపై 5శాతం ఐఆర్ను కలిపి వేతనాల్లో జమచేయనున్నారు.
సీఎం కేసీఆర్ది పెద్ద చేయి
ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా ఐఆర్ ప్రకటించి, వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఆగస్టు 6న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అన్నట్టుగానే ఐఆర్ను ప్రకటించి పీఆర్సీని సైతం నియమించారు. తెలంగాణ మొదటి పీఆర్సీ అయిన సీఆర్ బిశ్వాల్ కమిటీ.. కేవలం 7.5శాతం ఫిట్మెంట్ను సిఫారసు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 30శాతం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే 22.5 శాతం అధికంగా ఫిట్మెంట్ను వర్తింపజేసింది. కరోనా కల్లోలం పీడించినా, ఆర్థికంగా వెలుసుబాటు లేకపోయినా.. ప్రభుత్వంపై ఏడాదికి రూ.12,595 కోట్ల అదనపు భారం పడినా ఆ మొత్తాన్ని భరించేందుకు సిద్ధపడింది. ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ సిఫారసులతో నిమిత్తం లేకుండా 2015లో 43శాతం ఫిట్మెంట్తో తెలంగాణ ఇంక్రిమెంట్ను వర్తింపజేసింది.
ఈ రెండింటి అమలుతో ఫిట్మెంట్ 73శాతానికి చేరగా, తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్నవారయ్యారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రం లో 2,73,512 మంది రెగ్యులర్ ఉద్యోగులుంటే వీరిలో 21వేల మంది గెజిటెడ్, 2.21లక్షల మంది నాన్గెజిటెడ్, 30వేలకు పైగా నాలుగో తరగతి ఉద్యోగులున్నారు. టీచర్లు 1.03 లక్షలుండగా, పెన్షనర్లు మరో 2.88 లక్షలున్నారు. వీరే కాకుండా చిరుద్యోగులైన అంగన్వాడీలు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీని వర్తింపజేయనుండగా, వీరి వేతనాలు కూడా గణనీయంగా పెరుగనున్నాయి.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కోసం పీఆర్సీ కమిటీ నియమించినందుకు సీఎం కేసీఆర్కు తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. గతంలో తెలంగాణ ఇంక్రిమెంట్, ఒక పీఆర్సీని ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే. ఫిట్మెంట్ సిఫారసు చేయాలని పే కమిషన్ అధికారులను కోరుతున్నాం. రెండు కరువు భత్యం బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– వంగ రవీందర్ రెడ్డి, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు
కమిటీ ఏర్పాటు హర్షనీయం
ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ట్రెసా కేంద్ర సంఘంతోపాటు రెవెన్యూ ఉద్యోగుల పక్షాన సీఎంకు, సర్కార్కు థ్యాంక్స్.
– కే గౌతమ్కుమార్, ట్రెసా ప్రధాన కార్యదర్శి
మాట నిలబెట్టుకున్న సీఎం
ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ ఏర్పాటు చేయడంతోపాటు 5 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకం. సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
-డాక్టర్ మార్త రమేశ్, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం
పలు సంఘాల హర్షం
పీఆర్సీ కమిటీ నియమించడం హర్షనీయమని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పేర్కొన్నారు. సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు గాదె వెంకన్న, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం, తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ శ్రీనివాస్, సురేశ్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజీబ్ హుస్సేని, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, టీటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణిపాల్రెడ్డి, నరసింహస్వామి, యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి తదితరులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని మరోసారి రుజువైంది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులను స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. భవిష్యత్తులో సీఎం కేసీఆర్కు అండగా ఉంటాం.
– వీ మమత టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని నియమించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. నిబద్ధత కలిగిన వ్యక్తులతో కమిటీ నియమించారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తాం.
– మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు
పండుగ రోజు
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఈ రోజే నిజమైన పండుగ రోజు. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, శ్రీనివాస్గౌడ్లకు ధన్యవాదాలు.
– పింగిలి శ్రీపాల్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, పీఆర్టీయూ టీఎస్
ఉద్యోగులకు భరోసా
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు మరింత భరోసానిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఇదొక ఊరట. ఆరు నెలలు అనేది సరైన సమయం.
– దేవీప్రసాద్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
గత పీఆర్సీలో లబ్ధిపొందిన ఉద్యోగులు