హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన ధరలు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పాత ధరల్లో రిజిస్ట్రేషన్లకు ఇంకా ఒక్క రోజే మిగిలి ఉండడంతో భూముల క్రయ విక్రయాల నిమిత్తం జనాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు.
వ్యవసాయ భూముల విలువలు మూడు స్లాబులుగా(50 శాతం, 40 శాతం, 30 శాతం) పెంచుతూ నిర్ణయం వెలువరించారు. వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరాకు రూ.75 వేలు పెంపు. ఓపెన్ ప్లాట్ల విలువను మూడు స్లాబుల్లో(50 శాతం, 40 శాతం, 30 శాతం) పెంచారు. ఓపెన్ ప్లాట్ల కనీస ధర చదరపు గజం రూ.100 నుంచి రూ.200 పెంపు. అదే అపార్ట్మెంట్ ఫ్లాట్ల విలువను చదరపు అడుగుకు 20 శాతం, 30 శాతంగా పెంచారు. ఫ్లాట్ల కనీస విలువ చదరపు అడుగుకు రూ.800 నుంచి రూ.వెయ్యికి పెంపు. భూముల విలువలకు సంబంధించిన ఏవైనా సమస్యలపై సంప్రదించాల్సిన టోల్ఫ్రీ నంబర్ 1800 599 4788. ఈమెయిల్ చిరునామా ascmro@telangana.govt.in.
రాష్ట్రంలో ఏడేండ్ల తర్వాత తొలిసారి భూముల విలువను ప్రభుత్వం సవరించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ఇప్పటివరకు భూముల విలువ పెంపు, సవరణ జరుగలేదు. రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా యథావిధిగా ఉన్నాయి. కానీ బహిరంగమార్కెట్లో భూముల విలువలు బాగా పెరిగాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం ఈసారి కొంతమేరకు భూముల విలువను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రజలపై భారం పడకుండా పట్టణాలు, నగరాలవారీగా భూముల విలువను పెంచింది.