వరంగల్ రూరల్ : జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రయివేట్ బిల్డింగ్లో నిర్వహించలేమని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డిగ్రీ కళాశాలలో చదివే 170మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది. దీనిపై వెంటనే స్పందించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ నియోజకవర్గ కేంద్రంలోని డిగ్రీ కళాశాల నిర్వహణ అవసరాన్ని, ఆవశ్యకతను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులని, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని కళాశాల కొనసాగింపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే కోరారు. దీనిపై స్పందించిన సీఎం వర్ధన్నపేట డిగ్రీ కళాశాలను ప్రైవేట్ బిల్డింగ్ లో కొనసాగించేందుకు అనుమతులు జారీ చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
దీంతో అనుమతులు మంజూరు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను ఎమ్మెల్యే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్కు అందజేశారు. కళాశాల కొనసాగింపుకు వెంటనే చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేను కళాశాల అధ్యాపకులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.