టీఎన్జీవో నేత మామిళ్ల రాజేందర్
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన సీపీఎస్ను రద్దుచేసి, ఓపీఎస్ను అమలుచేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఐటీ పరిమితిని కేంద్రం రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ సమావేశాలు బుధవారం బీహార్లోని బేగుసరాయిలో ప్రారంభమయ్యాయి.
సమావేశాల్లో రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ విధానాలు అమలవుతున్నాయని, 80 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి ఇటీవలే సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను సైతం క్రమబద్ధీకరించి ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గిస్తున్నారని వివరించారు. తెలంగాణ విధానాలను ఇతర రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమావేశాల్లో టీఎన్జీవో నేతలు రాయికంటి ప్రతాప్, పర్వతాలు, లక్ష్మణ్, రాజీవ్రెడ్డి, చంద్రానాయక్, శ్యాంసుందర్రెడ్డి, బావండ్ల వెంకటేశ్, జీ అశోక్కుమార్, జీసీ రాజు తదితరులు పాల్గొన్నారు.