హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ‘2018లో జలవిలయంలో చిక్కుకొన్న కేరళను యుద్ధప్రాతిపదికన ఆదుకొన్నాం’ అంటూ 2019 లోక్సభ ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకొన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. చేసిన వరద సాయాన్ని ఇప్పుడు నయా పైసలతో సహా వసూలు చేస్తున్నది. వరద సాయం కింద 89,450 టన్నుల బియ్యం సరఫరాకు వెచ్చించిన రూ.205.81 కోట్ల మొత్తాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని కేరళ ప్రభుత్వానికి కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. చెల్లింపులు చేయకపోతే, వచ్చే ఏడాది రాష్ర్టానికి కేటాయించే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) నిధుల్లో కోత విధించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి చెల్లింపులను వెంటనే జరుపాల్సిందిగా సీఎం పినరాయి విజయన్ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది.
సర్వత్రా విమర్శలు
బీజేపీపాలిత గుజరాత్, కర్ణాటక, యూపీ, అస్సాంలో వరదలు వచ్చినప్పుడు ఆ రాష్ర్టాల సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి నష్టంపై ఆరా తీయడంతో పాటు కేంద్రం ఆదుకుంటుందని హామీ ఇస్తున్నారు. అడక్కుండానే గుజరాత్కు గత ఆర్థిక సంవత్సరం రూ.వెయ్యి కోట్లు వరద సాయంగా అందించారు. 2018 నుంచి ఇప్పటివరకూ 21 రాష్ర్టాలకు రూ.44,219 కోట్లను వరద సాయంగా పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది. అయితే, ఇందులో తెలంగాణకు ఒక్కపైసా కూడా విదల్చలేదు. బీజేపీ పాలిత రాష్ర్టాలకే వరద సాయంలో ప్రాధాన్యం చూపడమేమిటని విపక్షాలు కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తున్నాయి.
మోదీ అబద్ధాల అధిపతి
ప్రధాని మోదీ అబద్ధాలకు అధిపతి. తాను పేదవాడినని ప్రజల సానుభూతి కొట్టేయాలని చూస్తున్నారు. కానీ, ప్రజలు చాలా తెలివైనవాళ్లు.
– కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
దమ్ముంటే సీఏఏను అడ్డుకో
పశ్చిమబెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరుతాం. సీఎం మమతాబెనర్జీకి ఇదే నా సవాల్. ఆమెకు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్రంలో సీఏఏ అమలును అడ్డుకోవాలి.
– బీజేపీ నేత సువేందు అధికారి