మహబూబాబాద్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణలో ప్రతిపక్షాల నాయకులు(Opposition Leaders) ఎన్ని పాదయాత్రలు చేసినా వారికి ప్రయోజనం దక్కదని రాష్ట్ర గిరిజన, స్త్రీ , శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అన్నారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ఆర్తిగార్డెన్స్ లో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు.
నిరుపేద, బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్(CM KCR) దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రైతు బంధు, రైతు బీమాతో పాటు కల్యాణలక్ష్మి(Kalyana laxmi,), షాదీముబారక్, ఆసరా పింఛన్లు వంటి అనేక పథకాలు అమలు చేసి గొప్ప వ్యక్తిగా సీఎం కేసీఆర్ పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
గిరిజన రిజర్వేషన్ 6 నుంచి 10శాతం పెంచారని, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి, ఒక్కో నూతన గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల చొప్పున మంజూరు ఇచ్చారని వివరించారు. మారుమూల తండాల్లో ఎక్కడ చూసినా అద్దంలా మెరుస్తున్న సీసీ రోడ్లు కనిపిస్తున్నాయన్నారు. ఇవన్నీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ప్రజలు అండగా నిలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 75 ఏండ్లలో జరుగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్,మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు,బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.