Opposition Parties | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగొస్తుంది’ అన్న మాట ఇవాళ తెలంగాణలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. తమకు అలవాటైన రీతిలో అర్ధసత్యాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టడానికి విపక్షాలు రోజుకో పగటి వేషం వేస్తున్నాయి. ఎప్పటిలాగే రెండు నాల్కల ధోరణితో పూటకో మాట.. గడికో అబద్ధం ఆడుతూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులను ఇప్పటికే సాధించుకున్న తెలంగాణ.. నియామకాలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఒకేసారి 80,039 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతిపక్షాలకు కండ్లలో జిల్లేళ్లు మొలిసినయ్. రాష్ట్రంలో రోజురోజుకూ బలహీన పడటం, పార్టీ క్యాడర్ చేజారిపోతుండటం, ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడం.. వెరసి కునుకులేకుండా చేశాయి. ఎలాగైనా యువతను ప్రభుత్వానికి దూరం చేయాలనే కుట్రకు తెరలేపారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా నోటిఫికేషన్లు ఇస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఆ పరీక్షలను ఎలా అడ్డుకోవాలనే కుట్రలకు తెరలేపాయి. ఒకవైపు న్యాయస్థానాల్లో కేసులు వేయిస్తూ.. మరోవైపు అభ్యర్థులను తప్పుదోవ పట్టించే పనిలో పడ్డాయి.
గ్రూప్-2పై గడికో మాట
తెలంగాణలో ఉద్యోగ నియామకాలను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పరీక్షలకు తేదీలను ప్రకటించింది. అందులో భాగంగానే ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉన్నది. ఒకవైపు రాష్ట్రంలో ఉద్యోగ భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతుండటం, మరోవైపు యువత ప్రభుత్వానికి మరింత దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేని విపక్షాలు కొత్త డ్రామాకు తెరలేపాయి. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని నానా రాద్దాంతం చేశాయి. అమాయక యువతను ఉసిగొల్పి ఉద్యమాలకు దిగాయి. గ్రూప్-2 పరీక్షను రద్దు చేయాలని కోరుతూ రేవంత్రెడ్డి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నిరసన దీక్షకు దిగారు. టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ హాజరయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు అసెంబ్లీ సాక్షిగా గ్రూప్-2ను వాయిదా వేయాలని కోరారు. బీజేపీ నేత బండి సంజయ్ మొదటి నుంచి పరీక్షలపై నానా యాగీ చేస్తున్నారు. గ్రూప్-2ను వాయిదా వేయాలని మీడియా వేదికగా మొసలి కన్నీరు కార్చారు. అయినప్పటికీ గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది.
ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్నా వినకుండా..
గ్రూప్-2ను వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నదని, వాయిదా వేస్తే ఇబ్బంది అవుతుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి తనను కలిసి అభ్యర్థులకు నచ్చజెప్పారు. అయినా విపక్షాలు యువతను రెచ్చగొడుతూనే ఉన్నాయి. చివరికి ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈలోపే ఎన్నికల షెడ్యూల్ రావడం, 3నే నోటిఫికేషన్తోపాటు నామినేషన్ల స్వీకరణ ఉండటంతో పరీక్ష వాయిదా అనివార్యమైంది. 50 వేలమంది సిబ్బంది అవసరం ఉండటంతో పరీక్ష నిర్వహణ కష్టమని కలెక్టర్లు కమిషన్కు తెలపడంతో గ్రూప్-2ను వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. జనవరి 6, 7న నిర్వహిస్తామని తెలిపింది. అప్పుడేమో పరీక్షను వాయి దా వేయాలని నానా యాగీ చేసిన విపక్షాలు.. ఇప్పుడేమో యువతి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంటే దానిని గ్రూప్-2కు ముడిపెట్టి కొత్త డ్రామాకు తెరలేపారు. ఈ నేపథ్యంలో శవాల మీద పేలాలు ఏరుకోవడం ఇకనైనా మానుకోవాలని అభ్యర్థులు వారికి హితబోధ చేస్తున్నారు.