హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అగ్నిమాపకశాఖ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) లేకుండానే ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇంటర్బోర్డు అనుబంధ గుర్తింపు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎన్వోసీ సమర్పించాలన్న నిబంధన నుంచి ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మినహాయింపునిస్తూ అగ్నిమాపకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా జీవో 95ను జారీచేశారు. దీంతో 456 ప్రైవేటు కాలేజీలకు బోర్డు అనుబంధ గుర్తింపు దక్కనున్నది. కరోనా నేపథ్యంలో గతేడాది మాదిరిగానే 2021-22కుగాను ఈ నిబంధన నుంచి మినహాయింపునివ్వాలని కాలేజీల యాజమాన్య సంఘాలు ప్రభుత్వాన్ని అభ్యర్థించగా.. ఈ మేరకు సానకూలంగా స్పందించింది. కాలేజీలు ఎన్వోసీ పొందకుండా కేవలం అగ్నిమాపక పరికరాలు అమర్చుకుంటే సరిపోతుంది. ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయింపునిస్తూ జీవో జారీచేయడంపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం (టీపీజేఎంఏ) హర్షం వ్యక్తంచేసింది. సీఎం కేసీఆర్, మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీశ్, నాయకులు, శ్రీనివాస్చౌదరి, తిరుపతిరెడ్డి, మల్లేశ్, శ్రావణ్కుమార్ తదితరులు ధన్యవాదాలు తెలిపారు.