2003 మార్చి 27..తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పాటు తర్వాత ‘చలో ఢిల్లీ’ పేరిట వెయ్యి కార్లతో హైదరాబాద్ నుంచి దేశరాజధానికి కేసీఆర్ చేపట్టిన ర్యాలీ ఓ సంచలనం. తెలంగాణ రాష్ట్ర డిమాండ్పై జాతీయస్థాయిలో చర్చకు అది ఉపకరించింది.
20 ఏండ్ల తర్వాత దేశానికి సరికొత్త దిశను చూపేందుకు భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో సోమవారం భారీ ర్యాలీ. ఈ సారి 600 కార్లతో రెండురోజుల మహారాష్ట్ర పర్యటనకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి సోలాపూర్ వరకు జననేతకు దారిపొడవునా ఘనస్వాగతం లభించింది. పలుచోట్ల పూలుచల్లారు. వాన పడుతున్నా కేసీఆర్ను చూసేందుకు జనం ఆసక్తిగా ఎదురుచూశారు. సోమవారం సాయంత్రం సోలాపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి తెలుగు కుటుంబాల ఆనందానికి అవధుల్లేవు.
(సోలాపూర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి) ;ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు.. దాని ముందు భద్రతా సిబ్బంది. చీమల దారుల్లా ముంబై జాతీయ రహదారి-65పై దాదాపు ఆరేడు కిలో మీటర్ల పొడవునా కార్లు.. ఊరున్న చోట దారికిరువైపులా జనసందోహం. అందరి ముఖాల్లో చిరునవ్వు.. అంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యే సన్నివేశం.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సోమవారం చేపట్టిన మహారాష్ట్ర పర్యటన దృశ్యాలివి. పార్టీ ఏర్పాటు తర్వాత కేసీఆర్ 2003 మార్చి 27న ‘చలో ఢిల్లీ’ పేరుతో వెయ్యి కార్లతో చేపట్టిన కారు ర్యాలీ దేశంలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి మొదలై ఢిల్లీ వరకు సాగిన ఆనాటి యాత్రను తలపించేలా మహారాష్ట్ర పర్యటన సాగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులతో రెండు రోజుల పర్యటన కోసం సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం మహారాష్ట్రకు బయలుదేరారు. హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచి మొదలైన యాత్ర.. వందలాది కార్లతో నగరం నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, గుల్బర్గా (కల్బుర్గి) మీదుగా సోలాపూర్ వరకు అట్టహాసంగా సాగింది. 600 కార్లతోకూడిన భారీ కాన్వాయ్ రోడ్లపై వెళ్తుంటే ప్రజలు ఎక్కడికక్కడ సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు తీయడం కనిపించింది. తెలంగాణ, కర్ణాటకల మీదుగా సోలాపూర్లో ప్రవేశించిన కేసీఆర్కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇంత పెద్ద కాన్వాయ్ని తామెన్నడూ చూడలేదని అక్కడి స్థానిక నాయకుడు బీజే దేశ్ముఖ్ ‘నమస్తే’కు తెలిపాడు. ‘తమ ప్రాంతానికి అనేక మంది నేతలు, పార్టీల అధినేతలు వచ్చారు.. వెళ్లారు కానీ, స్థానికంగా ఎన్నడూ ఇంతటి పెద్ద సంఖ్యలో కార్లను చూడలేదు’ అని పేర్కొన్నాడు.
మహారాష్ట్రకు బయలుదేరిన కాన్వాయ్లోని అన్ని కార్లను ముందు పొడవాటి గులాబీ జెండా.. కారుకు ఇరువైపులా గులాబీ కండువాలు, ముందు ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’అనే స్టికర్.. వెనుక బీఆర్ఎస్ రౌండ్ స్టికర్తో ప్రత్యేకంగా అలంకరించారు. పటాన్చెరు నుంచి మొదలైన అపూర్వ పూలస్వాగతం మహారాష్ట్రలోని సోలాపూర్ వెళ్లే దాకా కొనసాగింది. జాతీయ రహదారి వెంట ఉన్న ఊర్లన్నీ జననేత సీఎం కేసీఆర్కు హారతిపట్టాయి. సాయంత్రానికి కాన్వాయ్ సోలాపూర్కు చేరుకొన్నది. మురం క్రాస్ వద్ద సీఎం కేసీఆర్కు మహిళలు మంగళహారతులు ఇచ్చి, ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు మురం క్రాస్ వద్ద మధ్యాహ్న భోజనం చేశారు. భోజన విరామం అనంతరం గ్రామ సర్పంచ్ సహా ఇతర గ్రామపెద్దలు వచ్చి సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అకడి నుంచి సోలాపూర్ బయలుదేరారు. మురం క్రాస్ నుంచి బయలుదేరిన కాసేపటికి జోరువాన మొదలైనా.. కాన్వాయ్ అలాగే ముందుకుసాగింది.
అబ్బురపడిన సోలాపూర్
సోలాపూర్కు కొద్దీ దూరంలో ఉన్న భీంనగర్ ఖిల్లా నుంచే గులాబీ గుబాళింపు మొదలైంది. చారిత్రకపురి సాక్షిగా చరిత్రాత్మక యాత్రగా నిలిచిపోయే ఈ భారీ కారు ర్యాలీని గ్రామస్థులు ఆసక్తిగా తిలకించారు. భీంనగర్ఖిల్లా నుంచి సోలాపూర్ దాకా ప్రతీచోటా.. ప్రతి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నిల్చొని గౌరవ సూచకంగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. స్వాగత తోరణాలు, గులాబీ జెండాలతో సోలాపూర్ నగరం గులాబీమయమైంది. ఉదయం 10:50 గంటలకుకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరిన కేసీఆర్ ‘మహా’యాత్ర సాయంత్రం 4:17 గంటలకు సోలాపూర్ చేరుకోవటంతో ముగిసింది. మొత్తానికి బీఆర్ఎస్ చరిత్రలో ప్రత్యేకించి మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించింది.
సోలాపూర్కు చేరుకొన్న కేసీఆర్ స్థానిక నాయకుడు, మాజీ ఎంపీ ధర్మన్న ముండయ్య సాదుల్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన నివాసం వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకొన్నారు. సోలాపూర్లో తెలుగు వచ్చినవారు, తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారు పెద్ద సంఖ్యలో ఉండగా.. వారంతా తెలుగులోనే సీఎం కేసీఆర్తో మాట్లాడారు. కేసీఆర్ సోలాపూర్కు రావడం సంతోషంగా ఉన్నదని, బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ మంచి ఆదరణ ఉన్నదని వారు చెప్పారు. స్థానిక రాజకీయాల గురించి కొద్దిసేపు ధర్మన్నతో కేసీఆర్ ముచ్చటించారు.
ఎవరీ ధర్మన్న సాదుల్?
సోలాపూర్ అంటేనే చేనేతకు, నేతకు ప్రసిద్ధి. తెలంగాణ జిల్లాలోని కరీంనగర్ జిల్లా కన్నాపూర్కు చెందిన ధర్మన్న సాదుల్ పూర్వీకులు ఉపాధి నిమిత్తం సోలాపూర్ వచ్చి స్థిరపడ్డారు. హ్యాండ్లూం, పవర్లూం కార్మికుల పక్షాన ధర్మన్న ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇప్పటికీ నిరాడంబరంగానే ఉంటారు. ఈ ప్రాంతానికి ధర్మన్న సాదుల్ పద్మశాలి వర్గం నుంచి తొలి మేయర్గా పనిచేశారు. మేయర్ల జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా కూడా వ్యవహరిచారు. సోలాపూర్ టెక్ట్స్టైల్స్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ధర్మన్న సాదుల్ రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా సేవలందించారు. సోలాపూర్లోని అనేక విద్యాలయాలు, దవాఖానలకు సలహాదారుగా కూడా పనిచేశారు. ఇక్కడ విద్యాలయాల ఏర్పాటుకు చొరవ తీసుకొన్నారు. సోలాపూర్ అభివృద్ధిలో ధర్మన్న సాదుల్ పాత్ర ఎంతో ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘకాలం పనిచేసిన ఆయన గతకొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత ధర్మన్న సాదుల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను కలిశారు. పార్టీ గురించి సుధీర్ఘంగా చర్చించడంతోపాటు మహారాష్ట్రలో, ముఖ్యంగా సోలాపూర్ ప్రాంతంలో తన సేవలు అందించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సోలాపూర్ ప్రాంతంలో నీతి, నిజాయితీ ఉన్న రాజకీయాలకు ధర్మన్న సాదుల్ పెద్ద ఉదాహరణ. ఆయనను సోలాపూర్ రాజకీయాల్లో పెద్దన్నగా పిలుస్తారు.
మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ మార్మోగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ యాత్ర సందర్భంగా మహారాష్ట్రలోని దాదాపు ప్రతీ గ్రామంలో గులాబీ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం ఊరూరా పోస్టరై వెలిసింది. దేశ్ కీ నేత.. కేసీఆర్.. ఆప్కో ఆదరణీయ.. హార్థిక్ స్వాగత్’ అనే స్వాగత తోరణాలు కనిపించాయి. సోలాపూర్లోని బాలాజీ సరోవర్కు సీఎం కేసీఆర్ చేరుకోగానే ఇక్కడి పార్టీ యువకులు, రైతులు పెద్దపెట్టున ‘జై కేసీఆర్.. జై బీఆర్ఎస్, దేశ్ కీ నేత కైసే హో.. కేసీఆర్ జైసే హో’ అంటూ నినదించారు. మాజీ ఎంపీ ధర్మన్న సాదుల్ ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లినప్పుడు తెలంగాణలోనే ఉన్నామా? అనిపించే వాతావరణం నెలకొన్నది. వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారు కేసీఆర్ను చూసి మురిసిపోయారు. ‘జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డిసహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ఆహ్వానిత నేతలతోపాటు మహారాష్ట్ర బీఆర్ఎస్పార్టీ నేతలు మాణిక్ కదం, శంకరన్న దోండ్గే తదితరులు ఉన్నారు.
నేడు పండరీపురానికి కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ఉదయం సోలాపూర్ నుంచి పండరీపురానికి వెళ్లనున్నారు. పండరీపురంలో శ్రీ విఠల్ రుక్మిణీ దేవస్థానాన్ని సందర్శించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి సర్కోలిలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. అనంతరం అక్కడి నుంచి తుల్జాపూర్కు వెళ్లి తుల్జాభవాని అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.