Operation Surya Shakti | కొత్తగూడెం క్రైం, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సరిహద్దు దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు పాచికలు వేస్తుంటే.. అవి పారకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే మావోయిస్టుల ఏరివేతకు ఇప్పటివరకు ఛత్తీస్గఢ్ కేంద్రంగా దశలవారీగా ‘ఆపరేషన్ ప్రహార్’ ఊపందుకుంటున్నది. దీంతోపాటే మావోయిస్టులు సైతం తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ప్రతివ్యూహాలను పన్నుతున్నారు. ఇప్పుడు వారి ఉనికిని సమూలంగా రూపుమాపేందుకు కొత్త పంథాలో దండకారణ్యాన్ని ఆపరేషన్ ‘సూర్యశక్తి’ కమ్ముకొస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. మావోయిస్టులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనే దిశగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం కేంద్రంగా పావులు కదుపుతూ వస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు నేతృత్వంలో ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఇటీవల మావోయిస్టు పార్టీ తమ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఆరు నెలలుగా విధ్వంసకర చర్యలకు పాల్పడుతూ తన ఉనికిని చాటుకుంటున్నది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవల కాలంలో భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ అనేక విధ్వంసకర చర్యలకు పాల్పడింది. ఇదిలావుండగా.. తాజాగా ఆ పార్టీ కేంద్ర కార్యదర్శితో సహా ఐదు రాష్ర్టాల కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసి.. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్ను నియమించిన విషయం విదితమే. మోస్ట్ వాంటెడ్గా ఉన్న దామోదర్ తన వ్యూహాలను సైతం ఛత్తీస్గఢ్ దండకారణ్యం కేంద్రంగా రచిస్తూ.. తెలంగాణలో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారాలను సీరియస్గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల చర్యలను సమూలంగా తిప్పికొట్టేందుకే ఆపరేషన్ ప్రహార్ను అప్గ్రేడ్ చేసినట్టు తెలుస్తున్నది.
ఇందులో భాగంగానే కేంద్ర పారా మిలటరీ బలగాలను రప్పించి.. వాటిని అధికారులు వివిధ గ్రూపులుగా విభజించారు. జిల్లా రిజర్వ్ గార్డు(డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), బస్తర్ ఫైటర్స్ను పారా మిలిటరీ బలగాలకు జత చేస్తూ ‘ఆపరేషన్ సూర్యశక్తి’గా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దక్షిణ ప్రాంతాల్లోని సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో ఆపరేషన్స్ నిర్వహించారు. మావోయిస్టులు నిర్వహిస్తున్న ఆయుధ తయారీ కర్మాగారాలను ధ్వంసం చేసి.. ఇద్దరు మావోయిస్టులను హతమార్చి, సుమారు 65 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
‘అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెక్యూరిటీ వ్యాక్యూమ్ ఏరియా’ అని పిలిచే మావోయిస్టుల ప్రాంతాల్లోకి సైతం చొచ్చుకెళ్లి ఆపరేషన్స్ను నిర్వహించేందుకే ఆపరేషన్ సూర్యశక్తిని మరింత బలోపేతం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో కాంకేర్, నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సైతం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆపరేషన్ సూర్యశక్తిని ప్రయోగించింది. మావోయిస్టుల ఆపరేషన్స్ పేరుతో డ్రోన్ బాంబులను ప్రయోగిస్తూ పోలీసులు దాడులు చేస్తున్నట్టు పది రోజుల క్రితం మావోయిస్టు పార్టీ పేరుతో లేఖ విడుదలైన విషయం తెలిసిందే. దట్టమైన అటవీ మార్గంలోకి చొచ్చుకుపోయి మావోయిస్టుల స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ సూర్యశక్తి పని చేస్తున్నట్టు తెలుస్తున్నది. మావోయిస్టులు-భద్రతా దళాల మధ్య జరుగుతున్న పోరు దండకారణ్యాన్ని రణరంగంగా మార్చింది. ఇరువర్గాల మధ్య జరుగుతున్న యుద్ధం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ, గిరిజనులతోపాటు ఇతర ఏజెన్సీలోని సామాన్య ప్రజలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తున్నది.