హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నిర్వహించిన పదో విడత ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా 3,476 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్టు ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ శిఖాగోయెల్ తెలిపారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 120 పోలీసు బృందాల్లో 676 మంది సిబ్బంది, మహిళా అభివృద్ధి, కార్మిక, ఆరోగ్యం, శిశు సంక్షేమ శాఖల సిబ్బంది, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, ఆయా జిల్లాల ఎన్జీవోల ప్రతినిధులు చురుకుగా పాల్గొన్నట్టు ఆమె తెలిపారు.
రక్షించబడిన 3,479 చిన్నారుల్లో బాలురు 3,074, బాలికలు 405 మంది ఉన్నారు. వీరిలో పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకుల చెంతకు 2,947 (బాలురు 2,619, బాలికలు 328) మందిని చేర్చారు. మిగిలిన 532 మందిని రెస్క్యూ హోంలకు తరలించారు. తెలంగాణ పోలీసులు కాపాడిన వారిలో ఇతర రాష్ర్టాలకు చెందిన వారు 707 (బాలురు 626, బాలికలు 81) మంది ఉన్నారు. బిక్షాటన నుంచి 15 మందిని రక్షించినట్టు తెలిపారు. వివిధ పరిశ్రమల నుంచి 114 మందిని కాపాడారు. దర్పణ్ యాప్ ద్వారా 335 మంది పిల్లల ఆచూకీ కనుగొన్నారు. మొత్తం 652 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, 655 మంది నిందితులను అరెస్టు చేసినట్టు ఏడీజీ శిఖాగోయెల్ వెల్లడించారు.