వేల్పూర్, ఏప్రిల్ 25 : రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం ఉచితంగా ఏర్పాటు చేస్తున్న శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న బాల్కొండ నియోజకవర్గంలోని యువత కోసం సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని హనుమాన్ నగర్ (ఒడ్డెర కాలనీ)లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా తరగతులను మంత్రి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన సుమారు వెయ్యి మంది యువత పోలీస్ శాఖలో కొలువులకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమైనట్టు చెప్పారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన యువత కోసం తన సొంత ఖర్చులతో శిక్షణా తరగతులను ఏర్పాటు చేయించినట్టు తెలిపారు. 850 మంది స్క్రీనింగ్ టెస్ట్కు హాజరు కాగా, వారిలో మెరిట్ ఆధారంగా 461 మందిని ముందస్తు శిక్షణకు ఎంపిక చేశామన్నారు.
ఖర్చుకు వెనుకాడకుండా..
నిరుపేద యువతకు న్యాయం జరగాలనే సంకల్పంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయిస్తున్నామని మంత్రి వేముల తెలిపారు. హైదరాబాద్లో అందించే కోచింగ్కు ఏమాత్రం తగ్గకుండా మరింత మెరుగైన మెటీరియల్తోపాటు నిష్ణాతులైన ఫ్యాకల్టీలతో స్థానికంగానే శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించినట్టు చెప్పారు. సుమారు 57 పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక యాప్ను సైతం సిద్ధం చేయించినట్టు పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినట్టు అవుతుందని మంత్రి తెలిపారు.